సాయిరెడ్డితో ‘ఇలా’ సగం ఏకీభవించిన టీడీపీ! 

వైసీపీ మాజీ కీలక నేత, మాజీ ఎంపీ, నాడు వైసీపీలో చాలామంది నెంబర్ 2 గా అభివర్ణించిన విజయసాయిరెడ్డి.. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా, ప్రకృతికి దగ్గరగా అన్నట్లుగా జీవిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ గ్యాప్ లో తాను త్వరలో డిజిటల్ మీడియా రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే తన మీడియా సంస్థ ఏ ఒక్క పార్టీకి అనుకూలంగా, వ్యతిరేకంగా వ్యవహరించదని.. న్యూట్రల్ గా ఉంటూ ప్రజాపక్షం వహిస్తుందని తెలిపారు.

ఆ సంగతి అలా ఉంటే… తాజాగా అమరావతి వర్సెస్ మావిగన్ చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమరావతి రాజధాని అంశంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజయసాయిరెడ్డి ‘ఎక్స్’ వేదికగా పలు సూచనలు చేశారు. అయితే దీనికి టీడీపీ నుంచి ఆసక్తికర రిప్లై రావడం గమనార్హం.

తొలుత విజయసాయిరెడ్డి అమరావతిపై చంద్రబాబుకు ఎలాంటి సూచనలు ఇచ్చారో చూద్దామ్…!

“బెంగళూరును 1537లో కెంపె గౌడ, హైదరాబాద్‌ ను 1591లో మహమ్మద్ కులీ కుతుబ్ షా, చెన్నైని 1639లో ఫ్రాన్సిస్ డే ఆధ్వర్యంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించాయి. అవి నేటి మహానగరాలుగా మారడానికి వరుసగా 500, 430, మరియు 380 సంవత్సరాలు పట్టింది. ఈ నగరాలు హడావిడిగా నిర్మించబడలేదు, కానీ తరతరాలుగా రూపుదిద్దుకున్నాయి”.

“అమరావతిని అప్పుల డబ్బుతో, గొప్ప భ్రమలతో రాత్రికి రాత్రే నిర్మించలేము. ముందుగా అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, ప్రభుత్వ ఉద్యోగులకు అవసరమైన గృహాల వంటి ప్రాథమిక సౌకర్యాలను నిర్మించి, అక్కడితో ఆపండి. ప్రజలు, వ్యాపారాలు, కాలంతో పాటు అమరావతి సహజసిద్ధంగా ఎదగనివ్వండి”.

“ఒక రాజధాని నగరం బలం నుండి ఎదగాలి, అప్పుల నుండి కాదు. ఆడంబరమైన డిజైన్లు, భారీ మౌలిక సదుపాయాలపై విచక్షణారహితంగా ఖర్చు చేయడం దార్శనికత కాదు. అది ఆర్థిక బాధ్యతారాహిత్యం.”

“ఈ రోజు అనవసరంగా ఖర్చు చేసే ప్రతి రూపాయి రేపు ఆంధ్రప్రదేశ్ ప్రజలపై భారం అవుతుంది. ఆదాయాన్ని ఆర్జించని ప్రాజెక్టులకు ఇచ్చే రుణాలు శ్రేయస్సును సృష్టించవు, పైగా అవి ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థపై భారం మోపుతాయి. పరిపాలనకు కార్యాచరణ అవసరం, ఆడంబరమైన నిర్మాణం కాదు”.

అని విజయసాయిరెడ్డి తనదైన సూచనలు చేశారు.

దీంతో… అమరావతిపై కాస్త అటు ఇటుగా ఎవరైనా మాట్లాడితే అంతెత్తున లేస్తున్న టీడీపీ నేతలు.. సాయిరెడ్డి విషయంలో మాత్రం ఉన్నంతలో కాస్త స్మూత్ గానే డీల్ చేస్తూ స్పందిచినట్లు కనిపించిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం.. సాయిరెడ్డి సూచనలకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బుద్ధా వెంకన్న విడుదల చేసిన బహిరంగ లేఖ, అందులో ఎంచుకున్న భాష!

తాజాగా సాయిరెడ్డి సలహాలపై స్పందించిన వెంకన్న… అయ్యా విజయసాయిరెడ్డి గారూ అని మొదలుపెట్టి… “బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాలు శతాబ్దాలుగా అభివృద్ధి చెందినవి అనేది నిజమే” అని అంగీకరించారు. అనంతరం తన వెర్షన్ వినిపించారు.

ఇందులో భాగంగా… “అవి పెద్ద నగరాలుగా మారడానికి ఒక దశలో ప్రభుత్వాలు దూరదృష్టితో పెద్ద స్థాయిలో పెట్టుబడులు పెట్టిన విషయం కూడా గుర్తించాలని.. దీనికి హైదరాబాద్ అభివృద్ది ఒక ముఖ్యమైన ఉదాహరణ అని చెబుతూ.. 400 సంవత్సరాలుగా కేవలం చారిత్రక నగరంగా ఉన్న హైదరాబాద్ 26 సంవత్సరాల క్రితం ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో హైటెక్ సిటీకి పునాది పడిందని” బుద్ధా వెంకన్న చెప్పుకొచ్చారు.

“అదే 400 సంవత్సరాలుగా అక్కడ రూ.1 లక్ష లేని ఎకరం భూమి ధర నేడు 100కోట్లు పైగా పలుకుతుందని తెలిపారు. ఆ సమయంలో అది కూడా “అవసరం లేని ఖర్చు” అని విమర్శలు వచ్చాయని.. కానీ ఈరోజు అదే హైటెక్ సిటీ హైదరాబాదు ప్రపంచ స్థాయి ఐటీ హబ్ గా మార్చిందని.. లక్షలాది ఉద్యోగాలు, ఎంతోమందికి ఉపాధి, అంతర్జాతీయ పెట్టుబడులు, భారీ ఆర్థిక వృద్ధికి అది పునాది అయిందని” బుద్ధా వెంకన్న వెల్లడించారు.

ఈ మొత్తం లేఖలో ఎక్కడా పరుష పదజాలాలు కానీ.. విమర్శనాస్త్రాలు కానీ సందించకుండా… అమరావతిని ప్రజలు ప్రపంచస్థాయి రాజధాని కావాలని నిర్ణయించుకున్నారు కాబట్టే మిమ్మల్ని, మీ జగన్ మోహన్ రెడ్డిని పక్కన పెట్టి, చంద్రబాబు నాయుడిని ఎన్నుకున్నారంటూ ఒక విరుపు మాత్రం వదిలారు. దీంతో… సాయిరెడ్డి విషయంలో టీడీపీ నేతలు కాస్త స్మూత్ గానే స్పందిస్తున్నట్లున్నారనే చర్చ మొదలైంది.

దీంతో… పలు ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

ఇందులో భాగంగా… ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే దానర్ధం రాష్ట్ర ప్రజలంతా అమరావతే రాజధానిగా కావాలని ఫిక్సయ్యారని బుద్ధా వెంకన్న చెప్పేది నిజమే అయితే… 2019లో అదే ఏపీ ప్రజలు అమరావతి వద్దని అనుకున్నారనుకోవాలా..? లేక, రాష్ట్రం అంటే కేవలం అమరావతే కాదు, సవాలక్ష విషయాలు ముడిపడి ఉంటాయని భావించాలా..? అనేది పలువురి ప్రశ్నగా ఉంది.

ఇక హైటెక్ సిటీకి 26 ఏళ్ల క్రితం పునాది వేసింది చంద్రబాబు అని టీడీపీ నేతలు చెబుతూనే ఉన్నారు. అయితే ఈ విషయంలో కేసీఆర్ ఖండించిన సంగతి తెలిసిందే. హైటెక్ సిటీ నిర్మాణానికి పునాది వేసింది నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి అని ఆయన పలుమార్లు, పలు వేధికలపై తనదైన శైలిలో వెల్లడించారు. హైదరాబాద్ దానికున్న భౌగోళిక సారూప్యం రీత్యా అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

ఇక టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లి, నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు సహచరుడు రేవంత్ రెడ్డి సైతం… హైటెక్ సిటీకి పునాది వేసింది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి అని నొక్కి చెప్పిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో శంషాబాద్ ఎయిర్ పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు వంటివి కాంగ్రెస్ పార్టీ హయాంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిర్మించినవని వెల్లడించారు.

కానీ… కేసీఆర్ భాషలో మందికి పుట్టిన బిడ్డ మాబిడ్డ అనే ప్రచారాలు మాత్రం టీడీపీ నేతలు మానడం లేదనే కామెంట్లకూ బుద్ధా వెంకన్న చెప్పిన ఉదాహరణ కారణం అయ్యిందనే చర్చా జరుగుతుంది.

పైగా… ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితికి, ప్రత్యేకంగా నాడు ఒక్క హైదారాబాద్ నుంచి వచ్చే ఆదాయ సౌలభ్యానికి… నేడు విభజిత ఆంధ్రప్రదేశ్ లో ఆర్ధిక పరిస్థితికి ఏమాత్రం పొంతన లేదనే విషయం బుద్ధా వెంకన్న మరిచిపోకూడదు.

ఎందుకంటే… ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, హాస్పటల్స్ నిర్మాణానికే ఐదు వేల కోట్లు లేవని ప్రభుత్వం చెబుతోన్న పరిస్థితి. ఇదే సమయంలో.. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్రం ఉందని పెద్దలు చెబుతున్న స్థితి. ఇలాంటప్పుడు కూడా బుద్ధా వెంకన్న వంటి విజ్ఞులు ఇలానే ఆలోచిస్తే ఎలా అనేది మరికొందరి అభిప్రాయంగా ఉంది.

ఏది ఏమైనా… పాలకులు వ్యక్తిగత ఈగోలకు, స్వార్ధ ప్రయోజనాలకు, మొండి పట్టుదలలకు పోయి రాష్ట్ర భవిష్యత్తుతోనూ, ఐదు కోట్ల ఆంధ్రుల జీవితాలతోనూ ఆడుకునే ఆలోచనలు చేయకూడదని అంతా కోరుకుంటున్నారు.