ఉక్కు సంకల్పం : ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్న బంద్ !

వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపీ వ్యాప్తంగా చేపట్టిన బంద్ మొదలైంది. ‘విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి’ పిలుపు మేరకు బీజేపీ తప్ప మిగతా పార్టీలన్నీ బంద్‌లో పాల్గొంటున్నాయి. ప్రజా, కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు, లారీ యజమానుల సంఘాలతోపాటు ప్రభుత్వం కూడా బంద్‌కు మద్దతు ప్రకటించింది.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. మధ్యాహ్నం ఒంటి గంట వరకు బంద్ కొనసాగనుంది. బంద్ సందర్భంగా మద్దిలపాలెంలో వామపక్షాలు రోడ్డెక్కి విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. బంద్ నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ మోహరించారు.

ఏపీ బంద్‌కు టీడీపీ, వామపక్షాలు మద్దతు తెలిపాయి. పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద విశాఖ ఉక్కు…ఆంధ్రుల హక్కు అనే నినాదంతో వామపక్షాలు,టీడీపీ శ్రేణులు నిరసనలు తెలుపుతున్నారు. బంద్‌ సందర్భంగా కళాశాలలు, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు. బంద్ నేపథ్యంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 1 గంట నుండి బస్సులు రోడ్డెక్కనున్నాయి. విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు నినాదంతో ఆవిర్భవించిన స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుకునేందుకు అన్ని పక్షాలు ఏకతాటిపై ముందుకు కదులుతున్నాయి.