అమెరికా – ఇరాన్ ల అధినేతల మొడితనమో, మూర్ఖత్వమో, పట్టూవిడుపులు లేని ఆలోచనా విధానమో.. కారణం ఏదైనప్పటికీ ఈ ఇరు దేశాల మధ్య యుద్ధం.. మధ్యలో హార్మూజ్ జలసంధితో ముడిపడిన చమురు రవాణా వ్యవహారం వెరసి, సమస్యలు రోజు రోజుకీ తీవ్రమవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో భారతదేశంలో సామాన్యుడి నడ్డి విరిగే ముహూర్తం ఫిక్సయ్యిందని తెలుస్తోంది.
అవును… పశ్చిమాసియాలో సంక్షోభం నేపథ్యంలో ఇప్పటికే పలు దేశాలు ఆర్థిక ఇబ్బందులతో కొట్టిమిట్టాడుతుండగా.. ఈ యుద్ధం వల్ల జరిగిన నష్టం నుంచి బయటపడటానికి గల్ఫ్ లోని పలు దేశాలకు దశాబ్ధాల సమయం పట్టొచ్చని అంటున్నారు.
ఇక ఇప్పటికే పలు దేశాల్లో చమురు ధరలు మండిపోతుండగా.. మరికొన్ని దేశాల్లో నిత్యావసర సరకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ క్రమంలో ఈ సంక్షోభం భారత్ పైనా తీవ్ర ప్రభావం చూపనుందని అంటున్నారు.
తాజాగా తెలుస్తోన్న సమాచారం ప్రకారం.. అంతర్జాతీయ ముడి చమురు ధరలు ఒక్కసారిగా వంద డాలర్లకు మించి పెరిగాయని అంటున్నారు. దీంతో.. దేశంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత ఏర్పడనుందా అన్న చర్చ భారీ ఎత్తున సాగుతోంది.
మరో వైపు ఇది ఆందోళకరమైన పరిస్థితులకు దారి తీసేలా ఉందని మార్కెట్ వర్గాల నుంచి వినిపిస్తుంది. అందుకు కారణంగా.. ఇప్పటికే ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు భారీ నష్టాలను మూటగట్టుకుంటున్నాయని చెబుతున్నారు.
వాస్తవానికి పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటినుంచీ అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలు 2022 ఏప్రిల్ నుంచి రిటైల్ ధరలను సవరించలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో విక్రయ ధరలు స్థిరంగా ఉండటంతో ఈ సంస్థలు భారీగా నష్టపోతున్నాయి.
ఇందులో భాగంగా… పెట్రోల్ పై లీటరుకు సుమారు రూ.18, డీజిల్ పై లీటరుకు సుమారు రూ.35గా ఈ సంస్థలు నష్ట పోతున్నాయని అంచానా వేస్తున్నారు నిపుణులు. ఈ నష్టం ప్రస్తుతం రోజుకు రూ.1,600 కోట్లకు చేరిందని చెబుతున్నారు. ఇంత నష్టం వస్తున్నా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రభుత్వం ఎందుకు పెంచడం లేదు అనే ప్రశ్న ఉత్పన్నమైన నేపథ్యంలో… దానికి ఓ కీలక రీజన్ తెరపైకి వచ్చింది!
వాస్తవానికి పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో… ఇప్పటికే భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు పెద్ద ఎత్తున పెరిగిపోవాలి కానీ… కేంద్రం ఈ విషయంలో కాస్త ప్రజలపై దయ చూపించిందని ఓ వర్గం అంటుంది. అయితే… దేశంలో పలు రాష్ట్రాల్లో వరుసగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. ప్రధానంగా బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకుని, గెలవాలని బలంగా ఫిక్సైన తమిళనాడు, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్న పరిస్థితుల్లో కాస్త ఓపికగా ఉందని మరో వర్గం అంటుంది.
ఈ లెక్కన చూసుకుంటే… ఈ నెల 23న తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి. ఇదే సమయంలో.. ఈ నెల 23, 29 తేదీల్లో రెండు విడతల్లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో… ఆ ఎన్నికల పోలింగ్ ముగిసిన మరుక్షణం.. అంటే… ఏప్రిల్ 30 నుంచి దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెద్ద ఎత్తున పెరిగే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు.
ఇక పెరగబోయే ధరలు ఏ స్థాయిలో ఉండొచ్చు అనే విషయంపైనా చర్చ మొదలైంది. ఈ సమయంలో తాజా లెక్కలు, అంతర్జాతీయంగా బ్యారెల్ కు పెరిగిన ధరలను పరిశీలించిన నిపుణులు… ఈసారి దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగానే ఉండొచ్చని అంటున్నారు.
సాధారణంగా… అంతర్జాతీయ మార్కెట్ లో బ్యారెల్ ధర 10 డాలర్లు పెరిగితే, దేశీయంగా లీటరుపై రూ.6 నష్టం అదనంగా పెరుగుతుందని చెబుతున్నారు. ఈ క్రమంలో… ప్రస్తుతం దేశంలోని ధరల ప్రకారం చమురు కంపెనీలు మనుగడ సాగించాలంటే బ్యారెల్ ధర 80-85 డాలర్ల మధ్య ఉండాలి.. కానీ ఇప్పుడు అది 120 – 125 డాలర్ల వద్ద ఉండటంతో లెక్కలు భారీగా మారొచ్చని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలొనే… లీటర్ పెట్రోల్ ధర 18 నుచ్మి 20 రూపాయల వరకూ పెంచుతారని.. ఇక, డీజిల్ ధర 35 నుంచి 40 రూపాయల వరకూ పెంచే అవకాశాలున్నాయని అంటున్నారు. పొరపాటున అదే గనుక జరిగినట్లు అయితే సామాన్యుడి నడ్డి విరిగినట్లే! పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి కాబట్టి బైక్ పక్కనెట్టి బస్సులోనూ, కారు పార్కింగ్ లోనే పెట్టి ఆటోలోనో వెళ్లిపోదామనుకుంటే పొరపాటే.. ఎందుకంటే.. ఈ రేటు ఎఫెక్ట్ నిత్యావసరాల మీద భారీగా పడి, ఆహార ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది!
అక్కడితో అయిపోలేదు సుమా… “పశ్చిమాసియాలో సైనిక ఉద్రిక్తతలు – ఆసియా, పసిఫిక్ లో మానవ అభివృద్ధిపై ప్రభావాలు” అనే పేరుతో ఐక్యరాజ్యసమితి రూపొందించిన నివేదిక ప్రకారం.. తాజా యుద్ధం ఎఫెక్ట్ వల్ల ప్రపంచవ్యాప్తంగా 88 లక్షల మంది ప్రజలు పేదరికంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని అంచనా వేయగా.. అందులో 25 లక్షల మంది భారత్ లోనే ఉండొచ్చని వెల్లడించింది! సో… ఒక్క యుద్ధం ప్రపంచ దేశాలపై ఈ రేంజ్ లో ప్రభావం చూపిస్తుందన్నమాట!
