Suicide: అనారోగ్యంతో మనస్తాపం చెందిన వ్యక్తి.. తన ఫోటోకి తానే పూజ చేసుకుని మరీ ఆత్మహత్య..!

Suicide: ఈ రోజుల్లో ఆత్మహత్య చేసుకోవటం అందరికీ ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఏ చిన్న సమస్య వచ్చినా కూడా దానిని ఎదుర్కొని, ఆ సమస్యను పరిష్కరించుకోవాలి అన్న ఆలోచన లేకుండా చాలా మంది క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియోలు తీసి వారి చావుకు గల కారణాలు చెప్పి మరి ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఆరోగ్య సమస్యలు,ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు ఇలా ఏ చిన్న సమస్య ఎదురైనా వాటి పరిష్కారానికి మార్గాలు పెట్టకుండా, ఆత్మహత్య చేసుకోవడానికి మార్గాలు వెతుకుతున్నారు.

ఖమ్మం గ్రామీణం ఏదులాపురంలో తాజాగా ఇటువంటి ఒక సంఘటన జరిగింది. అనారోగ్యంతో మనస్థాపం చెందిన వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడుకు చెందిన వాడపల్లి శివప్రసాద్ (48) 30 ఏళ్ల క్రితం పని వెతుక్కుంటూ రాష్ట్రానికి వలస వచ్చాడు. కొన్ని రోజులు విజయవాడ, ఖమ్మం ప్రాంతాలలో పనులు చేసుకుని జీవించేవాడు. ప్రస్తుతం ఏదులాపురం వెంపటి నగర్ లో ఒక ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. ఏదులాపురం సమీపంలో కోదాడ అడ్డు రోడ్డు లోని ఒక హోటల్ లో వంట మాస్టర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

ఈ నెల 1వ తేదీన ఇంట్లోకి వెళ్లిన శివ ప్రసాద్ గురువారం వరకు ఎక్కడా కనిపించకపోవడంతో ఇంటి ఓనర్ కు అనుమానం వచ్చింది. దీనితో ఇంటి ఓనర్ కిటికీలోనుంచి చూడగా శివ ప్రసాద్ ఫ్యాన్ కి ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించాడు. ఇంటి ఓనర్ వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శివ ప్రసాద్ ఆత్మహత్యకు అతని అనారోగ్య సమస్యలే కారణమని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శివప్రసాద్ తన మరణానికి ముందు తన ఫోటోకు తానే పూజ చేసుకొని మరీ ఆత్మహత్య చేసుకున్నాడు.