విద్యార్థిని కాలితో తన్నుతూ విచక్షణారహితంగా ప్రవర్తించిన అధ్యాపకుడు..!

ప్రస్థుత కాలంలో కొన్ని కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలో ర్యాంకులు సాధించటం కోసం పిల్లలను మానసికంగా కృంగదీస్తున్నారు.దీంతో కార్పొరేట్ కళాశాలలో చదివే విద్యార్థుల ఆత్మహత్య కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. అంతేకాకుండా ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల ప్రవర్తించే తీరు కూడా విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమవుతోంది . ఇటీవల ఒక కార్పొరేట్ పాఠశాలలో ఫీజు కట్టలేదని విద్యార్థులను పాఠశాల గదిలో స్పందించిన సంఘటన మరవకముందే తాజాగా మరొక ఘటన వెలుగులోకి వచ్చింది. తరగతి గదిలో ఉపాధ్యాయుడు విద్యార్థిని కాలితో తాన్నుతూ ప్రవర్తించిన తీరు అందరిని ఆగ్రహానికి గురిచేస్తుంది.

వివరాలలోకి వెళితే…విజయవాడ బెంచ్‌ సర్కిల్‌ సమీపంలో ఉన్న శ్రీ చైతన్య కాలేజీలో ఈ ఘటన చోటు చేసుకుంది. తరగతి గదిలో ఉపాధ్యాయుడు విద్యార్థిని విచక్షణ రహితంగా కొట్టడమే కాకుండా కాలితో తన్నుతూ రెచ్చిపోయాడు. ఈ పరిణామాన్ని వెనక బెంచ్ లో కూర్చున్న మరొక విద్యార్థి తన సెల్ ఫోన్ లో రికార్డు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో విద్యాశాఖ అధికారులు కళాశాలకు వెళ్లి ఈ ఘటనపై విచారణ చేపట్టారు.

అధికారులు సదరు ఉపాధ్యాయుడిని విచారించగా ఎన్నిసార్లు చెప్పినా కూడా విద్యార్థి చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని తరగతి గదిలో పాటలు వింటున్నాడని అందువల్ల కోపంతో అలా కొట్టినట్లు అంగీకరించాడు. అధికారులు విద్యార్థిని విచారించగా తన వద్ద ఇయర్ ఫోన్స్ లేవని సమాధానం చెప్పాడు. ఈ ఘటనపై అధికారులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే విద్యార్థి పట్ల విచక్షణారహితంగా ప్రవర్తించిన సదరు ఉపాధ్యాయుడిని కళాశాల యాజమాన్యం విధుల నుండి తొలగించారు.