టిటిడి ధ‌ర్మక‌ర్తల మండ‌లి స‌భ్యునిగా శ్రీ దాసరి కిరణ్ కుమార్ ప్రమాణస్వీకారం

టిటిడి ధ‌ర్మక‌ర్తల మండ‌లి స‌భ్యునిగా శ్రీ దాసరి కిరణ్ కుమార్ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. శ్రీ‌వారి ఆల‌యంలోని బంగారు వాకిలి చెంత ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్‌బాబు వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీ దాసరి కిరణ్ కుమార్ శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. అనంత‌రం శ్రీ‌వారి తీర్థ ప్రసాదాలు, చిత్రప‌టాన్ని అందించారు.

ఈ కార్యక్రమంలో బోర్డు సెల్ డెప్యూటీ ఈఓ శ్రీమతి క‌స్తూరి బాయి, పేష్కార్ శ్రీ శ్రీ‌హ‌రి, పారుపత్తేదార్ శ్రీ తులసీప్రసాద్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

అనంతరం శ్రీ దాసరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సేవ కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు నాకు బోర్డ్ సభ్యునిగా సేవ చేసుకునే భాగ్యం కల్పించినందుకు ఆయనకి పాదాభివందనం చేస్తున్నాను. ఈ సేవ కోసం దేశంలో ఎంతో మంది ప్రయత్నం చేస్తుంటారు. పదిహేనేళ్ళుగా ముఖ్యమంత్రి జగన్ గారితో పాటు ప్రయాణం చేస్తున్నాను. నా విధేయతని గుర్తించి స్వామి వారి సేవ చేసుకునే అదృష్టం కలిగించిన ముఖ్యమంత్రి జగన్ గారి ఋణం ఎప్పటికీ తీర్చుకోలేను. స్వామి వారి ఆశీస్సులతో భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని మంచి సంక్షేమ పథకాలని జగన్ గారు అమలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఒక దైవ స్వరూపంగా అన్ని తరగతుల ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నారు. స్వామి వారి ఆశీస్సులు, ప్రజల దీవెనతో జగన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వల్లభనేని గారికి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గారికి, ఈవో ధర్మారెడ్డి గారికి కృతజ్ఞతలు. టీటీడీ లోచాలా అనుభవంతో వున్న యంత్రాంగం వుంది. చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గారు అద్భుతంగా ముందుకు తీసుకువెళుతున్నారు. తోటి బోర్డ్ సభ్యులతో కలసి మరిన్ని మంచి బృహత్తర కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్ళి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా నావంతు ప్రయత్నం చేస్తాను” అని తెలియజేశారు.