శివకుమార స్వామి చివరి కోరిక ఏమిటో తెలుసా

కర్ణాటకలోని సిద్దగంగ మఠాధిపతి శివకుమార స్వామి సోమవారం శివైక్యం చెందారు. శివ కుమార స్వామి చికిత్స పొందుతున్న సమయంలో   ఓ కోరిక కోరారంట. ఆ కోరిక తెలిస్తే అంతా ఆశ్చర్యపోకుండా ఉండలేరు. ఆయన భారత రత్న ఇవ్వమనో, పద్మశ్రీ ఇవ్వమనో కోరలేదు. ఆయన ఏమన్నారంటే…

 ‘నేను శివైక్యం చెందే సమయం… ఏ క్షణంలోనైనా కావచ్చు.. ఉదయం అయితే పిల్లలంతా టిఫిన్‌ చేసిన తర్వాత, ఒక వేళ మధ్యాహ్నం, రాత్రి అయితే పిల్లలంతా భోజనం చేసిన తర్వాతే నా శివైక్యం విషయాన్ని ప్రకటించండి’ అని మఠం జూనియర్‌ స్వామిజీ సిద్ధలింగస్వామిని ఆదేశించారట.

శివకుమార స్వామిజీ సోమవారం ఉదయం 11.44 గంటలకు శివైక్యం చెందిన సమయంలో పిల్లలు భోజనం చేస్తున్నారు. స్వామీజీ చివరికోరిక మేరకు పిల్లలంతా భోజనం చేసిన తర్వాతే ఆయన శివైక్యం చెందినట్లు ప్రకటించారు. విషయం తెలుసుకున్న పిల్లలంతా భోరున ఏడుస్తూ మఠం వైపునకు పరుగులు తీశారు. అదండీ నడిచేదేవుడి చివరి కోరిక.