మూడో వన్డేలో భారత్ లక్ష్యం 244 పరుగులు

భారత్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడో వన్డేలో న్యూజిలాండ్ 49 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటయ్యింది.  దీంతో భారత్ లక్ష్యం 244 పరుగులుగా న్యూజిలాండ్ నిర్దేశించింది. ఐదు వన్డేల సిరిస్ లో భాగంగా భారత్ ఇప్పటికే రెండు వన్డేలు గెలిచి సిరిస్ లో 2-0 ఆధిక్యంతో ఉంది. మూడో వన్డేలోను గెలిచి సిరిస్ ను కైవసం చేసుకునేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. మౌంటూ మాంగన్ వేదికగా మూడో వన్డే జరుగుతోంది.

 రాస్‌ టేలర్‌(93;106 బంతుల్లో 9 ఫోర్లు), టామ్‌ లాథమ్‌(51; 64 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్సర్‌) ఆకట్టుకోవడంతో న్యూజిలాండ్‌ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్ తీసుకున్న కివీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. మున్రో(7) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరగా, ఆపై కాసేపటికి గప్టిల్‌(13) కూడా ఔటయ్యాడు. దాంతో 26 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కివీస్‌ కోల్పోయింది. ఆ తరుణంలో కేన్‌ విలియమ్సన్‌-రాస్‌ టేలర్‌ జోడి ఇన్నింగ్స్‌ ను పరుగులు పెట్టించింది. వీరిద్దరూ 33 పరుగులు జత చేసిన తర్వాత విలియమ్సన్‌(28) పెవిలియన్‌ బాట పట్టాడు.

ఆ తర్వాత టేలర్‌-లాథమ్‌లు స్కోరు బోర్డును చక్కదిద్దారు. ఈ జంట 119 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో కివీస్‌ తేరుకుంది. ఈ క్రమంలోనే ముందుగా టేలర్‌ హాఫ్‌ సెంచరీ చేయగా, లాథమ్‌ కూడా అర్థ శతకంతో మెరిశాడు.  హాఫ్‌ సెంచరీ సాధించిన లాథమ్‌ స్కోరును పెంచే క్రమంలో ఔటయ‍్యాడు. భారత బౌలర్లలో మహ్మద్‌ షమీ మూడు వికెట్లు సాధించగా, హార్దిక్‌ పాండ్యా, చహల్‌, భువనేశ్వర్‌ కుమార్‌లు తలో రెండు వికెట్లు తీశారు.