అమెరికాలో తెలుగోడిని హత్య చేసిన నల్ల జాతీయులు

అమెరికా ఉన్మాదుల చేతిలో మరో తెలుగువాడు బలయ్యాడు. యాదాద్రి జిల్లా రహీంఖాన్ పేటకు చెందిన గోవర్ధన్ రెడ్డి అమెరికా ఫ్లోరిడా రాష్ట్రంలోని పెన్సకోలాలో ఉంటున్నాడు. ఇతడు ఓ గ్యాస్ స్టేషన్ స్టోర్ లో కౌంటర్ మేనేజర్ గా పని చేస్తున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భార్య పిల్లలతో కలిసి బోడుప్పల్ లో ఉంటోంది. కొత్త గోవర్ధన్ రెడ్డి గత 15 సంవత్సరాల నుంచి అమెరికాలో పని చేస్తున్నాడు.

బుధవారం మరో అరగంటలో స్టోర్ మూసివేస్తామనగా ముగ్గురు నల్లజాతీయులు స్టోర్ లోకి ప్రవేశించారు. అందులో ఓ మహిళ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. స్టోర్ లో దోచుకునేందుకు వచ్చి గోవర్దన్ రెడ్డితో పాటు మరో వ్యక్తి పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గోవర్ధన్ రెడ్డి అక్కడికక్కడే చనిపోగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఆ ముగ్గురిని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. 

కాల్పులకు పాల్పడిన నిందితులు వీరే

 గోవర్ధన్ రెడ్డి మృతితో భార్య శోభారాణి, కూతుళ్లు శ్రియ, తులసి విషాదంలో మునిగిపోయారు. శ్రియ బిటెక్ సెకండియర్ చేస్తుండగా, తులసి ఇంటర్ చదువుతోంది. గోవర్ధన్ తల్లిదండ్రులు స్వగ్రామంలోనే వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. దీంతో బోడుప్పల్, రహీంఖాన్ పేటలో విషాద చాయలు అలుముకున్నాయి.

చాలా పేదరికం నుంచి వచ్చిన గోవర్ధన్ రెడ్డి ఉన్నతునిగా స్థిర పడుతున్న సమయంలోనే ఈ దారుణం జరగడంతో అంతా కన్నీరు మున్నీరయ్యారు. త్వరగా గోవర్ధన్ రెడ్డి మృతదేహాన్ని గ్రామానికి తీసుకువచ్చేందుకు తెలంగాణ, భారత ప్రభుత్వాలు సహకరించాలని కుటుంబ సభ్యులు, బంధువులు కోరుతున్నారు.