అయోధ్య వివాదం పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు

వివాదాస్పద రామజన్మ భూమి- బాబ్రీ మసీదు కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. మధ్యవర్తిత్వం ద్వారా ఈ కేసును స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవాలని ఆదేశించింది. ముగ్గురు వ్యక్తులతో మధ్యవర్తిత్వ ప్యానెల్ ను ప్రకటించింది. శ్రీశ్రీ రవిశంకర్, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కల్లీపుల్లా, సీనియర్ న్యాయవాది శ్రీరాం పంచులతో కమిటిని ఏర్పాటు చేసింది.

మధ్యవర్తిత్వ ప్రక్రియ ఫైజాబాద్ లో కొనసాగించాలని ఆదేశించింది. ఈ చర్చలన్నీ సిసి కెమెరా పర్యవేక్షణలో అత్యంత రహస్యంగా కొనసాగించాలని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన సమాచారం మీడియాకు తెలుపవద్దని ధర్మాసనం ఆదేశించింది. నాలుగు వారాల్లో మధ్యవర్తిత్వ ప్రక్రియ తొలి నివేదిక సమర్పించనుంది.

వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని ముగ్గురు కక్షిదారులైన సున్నీ వక్ఫ్‌ బోర్డు, నిర్మోహి అఖాడా, రాంలల్లా సమానంగా పంచుకోవాలంటూ 2010లో అలహాబాద్‌ హైకోర్టు తీర్పు చెప్పింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో మొత్తం 14 పిటిషన్లు దాఖలయ్యాయి. కాగా నిర్మోహీ అఖాడా మినహా హిందూత్వ సంస్థలన్నీ మధ్యవర్తిత్వానికి ససేమిరా అంటుండగా… ముస్లిం సంస్థలు మధ్యవర్తిత్వానికి ఇప్పటికే మద్దతు తెలిపాయి.