తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. చంద్రబాబు సహా ఐదుగురు టీడీపీ నేతల బృందానికి రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఖరారయ్యింది. ఇటీవల టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై జరిగిన దాడి నేపథ్యంలో రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనుంది చంద్రబాబు బృందం.
రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని రద్దు చేసి, రాష్ట్రపతి పాలనను విధించాలన్నది టీడీపీ డిమాండ్గా కనిపిస్తోంది. రాష్ట్రపతి అలాగే పలువురు కేంద్ర మంత్రుల్ని టీడీపీ కలవనుందట. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రుల్ని కలిసేందుకు టీడీపీ సర్వ సన్నాహాలూ చేసుకుంటోంది.
ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కూడా టీడీపీ కోరుతోందిగానీ, అది సాధ్యపడేలా కనిపించడంలేదు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం చంద్రబాబుని కలిసేందుకు సుముఖత వ్యక్తం చేయకపోవచ్చంటున్నారు. అయితే, ఎలాగైనా ఢిల్లీ వేదికగా తన ‘పవర్’ చూపించుకోవాలని తహతహలాడుతున్న చంద్రబాబు, తనకున్న పాత పరిచయాల్ని పూర్తిగా ఉపయోగించుకుని అపాయింట్మెంట్లను పొందేందుకు ప్రయత్నిస్తున్నారట.
ఇంతకీ, టీడీపీ కోరుకున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వస్తే ఎవరికి ఉపయోగం.? అసెంబ్లీ రద్దవుతుందా.? తాత్కాలికంగా కొన్ని రోజులపాటు వైఎస్ జగన్ సర్కార్ చేవలేని స్థితిలోకి వెళ్ళిపోతుందా.? ఇలా రకరకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చేయాలనుకోవడం చంద్రబాబుకి తగదు. అసలు టీడీపీ మూల సిద్ధాంతాల్లోనే రాష్ట్రపతి పాలనకు వ్యతిరేకంగా రాసుకున్నారు. మరి, ఆ టీడీపీకి ప్రస్తుత అధినేత అయిన చంద్రబాబు, టీడీపీ మూల సిద్ధాంతాల్ని గౌరవించకపోతే ఎలా.?
ఏమోగానీ, చంద్రబాబు తీరుతో టీడీపీ నేతలు, కార్యకర్తలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పైకి అహో చంద్రబాబు అంటున్న తెలుగు తమ్ముళ్ళు.. అధికారం లేకపోతే చంద్రబాబు ఇంత అడ్డగోలుగా వ్యవహరిస్తారా.? అని ఆశ్చర్యపోతున్నారట.