తమ సమస్యల పరిష్కారం కోసం రైతులు చేపట్టిన పాదయాత్ర ఢిల్లీ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. పలు డిమాండ్ల సాధనకై కిసాన్ క్రాంతి ర్యాలీ పేరిట 20వేల మంది రైతులు యూపీ హరిద్వార్ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి పాదయాత్రగా బయలుదేరారు. ఢిల్లీలోని కిసాన్ ఘాట్ వద్ద నిరసన తెలపడానికి సిద్దమయ్యారు.
రైతులు ఢిల్లీకి ప్రవేశించకుండా పోలీసులు ఉదయం నుంచే అడ్డుకున్నారు. బారికేడ్లను పెట్టడంతో ట్రాక్టర్లతో రైతులు వాటిని తొక్కించారు. పోలీసులు భాష్పవాయువును, వాటర్ కెనాన్లను ప్రయోగించారు.దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గాంధీ జయంతి రోజున రైతులపై దాడికి పాల్పడడంతో అంతటా విమర్శలు వస్తున్నాయి. రైతుల పై లాఠీఛార్జీ చేసిన వీడియోలు కింద ఉన్నాయి చూడండి.
రుణమాఫీ, ఉచిత కరెంట్, స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అమలుతో పాటు మరికొన్ని డిమాండ్ల సాధనకై రైతులు పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. హరిద్వార్ నుంచి బయలుదేరిన రైతులు సోమవారం సాయంత్రం ఘజియాబాద్కు చేరుకున్నారు. అక్కడ ఉత్తరప్రదేశ్కు చెందిన ఇద్దరు మంత్రులు రైతు నాయకులతో చర్చలు జరిపినప్పటికీ ఫలితం లేకపోయింది. తమ సమస్యలపై కచ్చితమైన హామీ వచ్చేవరకు వెనక్కితగ్గేది లేదని రైతులు తేల్చిచెప్పారు.
కేంద్ర ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కారిస్తుందని నాలుగేళ్ల పాటు ఎదురుచూశామని.. అయినా లాభం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. రైతు నాయకులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా ఉండేందుకు సరిహద్దులోని రహదారులపై పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటుచేసిన పోలీసులు తూర్పు ఢిల్లీలో 144 సెక్షన్ విధించారు. అంతేకాకుండా భారీగా బలగాలను మోహరించారు.
