భారత్ అతి పెద్ద దౌత్యవిజయం సాధించింది. ఇండియాలోని పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్ల రూపాయలు బకాయి పడి తప్పించుకుని తిరుగుతున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని లండన్లో అరెస్టు చేశారు. దీంతో ఆయనను భారత్కు అప్పగించే ప్రక్రియ మొదలైనట్టేనని చెబుతున్నారు. నీరవ్ మోదీని మధ్యాహ్నం 3.30 గంటలకు అక్కడి కోర్టులో హాజరుపరచనున్నట్టు తాజా సమాచారం.
నీరవ్ మోదీ, అతడి మేనమామ మోహుల్ చోక్సీ కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంక్కు సుమారు రూ.14 వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టారు. విదేశాలకు పారిపోయిన నీరవ్ను భారత్ తీసుకొచ్చేందుకు సీబీఐ, ఈడీ కొద్ది నెలలుగా తీవ్ర ప్రయత్నాలు సాగిస్తోంది. నీరవ్ మోదీపై చట్టపరమైన చర్యలు తీసుకొని తిరిగి భారత్కు తీసుకొచ్చేందుకు మార్గం సుగమం చేయాలని కోరుతూ మార్చి 9న లండన్లోని హోంశాఖ కార్యాలయానికి ఈడీ లేఖ రాసింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న లండన్ కోర్టు అతడికి అరెస్టు వారెంటు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఆయన అరెస్టు చోటుచేసుకుంది.
కాగా, నీరవ్ మోదీ ప్రస్తుతం లండన్లో వేషం మార్చి తిరుగుతూ, వజ్రాల వ్యాపారం చేస్తున్నారని లండన్కు చెందిన పత్రిక ఇటీవల సంచలనం కథనం ప్రచురించింది. దీంతో ఆయనను భారత్ రప్పించడానికి భద్రతా ఏజెన్సీలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. సీబీఐ బృందం కూడా లండన్కు వెళ్లేందుకు సిద్ధమవుతోంది.
