బీరు ఎక్కువ ధరకు అమ్మాడని సేల్స్ బాయ్ ని కాల్చిచంపిన మందు బాబులు

తాగిన మైకంలో వారు ఏం చేస్తున్నారో వారికే అర్ధం కాలేదు. బీరు కావాలని వచ్చి ఎక్కువ ధర ఉందని దుకాణంలో అమ్మే సేల్స్ బాయ్ తో గొడవ పెట్టుకొని ఏకంగా అతని పై బుల్లెట్ల వర్షం కురిపించారు. దీంతో ఆ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

నోయిడాలోని ఐచార్ ప్రాంతంలో ఉన్న ఓ బీరు షాపు వద్దకు సురేంద్ర, రాజు చేరుకున్నారు. ఈ సందర్భంగా బీర్ ధర ఎంత? అని వీరు అడగ్గా షాపులో పనిచేస్తున్న కుల్దీప్ సమాధానం ఇచ్చాడు. అయితే మిగతా షాపుల కంటే ఇక్కడ రూ.10 అధికంగా అమ్ముతున్నారని యువకులు కుల్దీప్ తో వాగ్వాదానికి దిగారు. వివాదం కాస్తా ముదరడంతో ఇద్దరు యువకులు తమ తుపాకులతో కుల్దీప్ పై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.

శరీరంలోకి బుల్లెట్లు దూసుకెళ్లిపోవడంతో కుల్దీప్ రక్తపు మడుపులో పడిపోయాడు. కాల్పుల శబ్దం విన్న స్థానికులు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే కుల్దీప్ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. మరోవైపు పరారీలో ఉన్న సురేంద్ర, రాజు కోసం గాలింపును ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కాల్పులు జరిపేందుకు మద్యం ధరే కారణమా? లేక వేరే ఉద్దేశాలు ఉన్నాయా? అనే కోణంలోనూ దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.