రోడ్డు పై దొరికిన పసికందుకు పాలిచ్చి మాతృత్వాన్ని చాటిన మహిళా కానిస్టేబుల్

కొద్ది రోజుల కిందట హైదరాబాద్ కానిస్టేబుల్ ప్రియాంక రోడ్డు పై దొరికిన ఓ పసిపాపకు పాలిచ్చి అందరితో శభాష్ అనిపించుకుంది. తాజాగా బెంగుళూరులోను మహిళా కానిస్టేబుల్ రోడ్డు పై దొరికిన పసిపాపకు పాలిచ్చి మాతృత్వాన్ని చాటింది.

బుధవారం ఉదయం బెంగళూరులో చలికి ఒణుకుతూ ఏడుస్తూ  ఓ పసిపాప కనిపించింది. గమనించిన వాకర్స్ బెంగళులోని యెలహంక ప్రభుత్వ ఆస్పత్రిలో ఆ పసిపాపను చేర్చి పోలీసులకు సమాచారమిచ్చారు. ఆ పాప వివరాలు కనుక్కొనే పనిని కానిస్టేబుల్  సంగీత హలిమణికి అప్పగించారు. సంగీత ఆస్పత్రికి వెళ్లగానే ఆ పసిబిడ్డకు డాక్టర్లు వైద్యం చేస్తూ గ్లూకోజ్ ఎక్కిస్తున్నారు. సంగీతకు పది నెలల పాప ఉంది. పాప పరిస్థితిని అర్దం చేసుకున్న సంగీత డాక్టర్ల అనుమతితో ఆ పసికందుకు పాలు పట్టింది. దీని పై సంగీత మాట్లాడారు ఆమె ఏమన్నారంటే…

“అగ్రికల్చర్ యూనివర్సిటి పరిధిలో పసిపాప దొరికిందని ఆ పాప వివరాలు కనుక్కునే పనిని అధికారులు నాకు అప్పగించారు. నేను ఆసుపత్రికి వెళ్లే సరికి పాప అత్యంత దయనీయ స్థితిలో ఉంది. శరీరమంతా దుమ్ము అంటుకుంది. చీమలు కుట్టినట్టు బెందులు ఉన్నాయి. ఆ బిడ్డ పరిస్థితి చూసి చలించిపోయాను. ఆ పాప ఒక్కరోజు ముందే పుట్టిందని తల్లి పాలు లేక శరీరంలో సరైన గ్లూకోజ్ లేదని డాక్టర్లు చెప్పారు. ఇక క్షణం ఆలోచించకుండా పాలు పట్టాను. ఆ పాప నా స్తనాన్ని విడిచిపెట్టకుండా 15 నిమిషాల పాటు పాలు తాగింది. అప్పుడు ఆ పాప ఆకలితో పాటు ఇలా ఇంకెంత మంది ఉన్నారో అని అనుకున్నాను. 

 పాలు పట్టడం వల్లే పాప బతికిందని డాక్టర్లు తెలిపారు. అప్పుడు నేను చాలా సంతోషించాను. ఆ తర్వాత పాపకు మెరుగైన చికిత్స కోసం విలాస్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ కూడా పాప ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశాను. పాప ఆరోగ్య పరిస్థితి బాగుందని వైద్యులు చెప్పారు. కళ్లు కూడా తెరవని పాపను విడిచి వెళ్లేందుకు మనసు ఒప్పలేదు. కానీ ఇంటికి వెళ్లి నా బిడ్డను చూశాక కాస్త కుదుట పడ్డాను. చాలా గొప్ప పని చేశావు అని నా భర్త ప్రశంసించారు. నాకు బిడ్డ ఉన్నందున చిన్నారిని దత్తత తీసుకోలేకపోయాను.” అని సంగీత అన్నారు. సంగీత గురించి తెలుసుకున్న పోలీస్ ఉన్నతాధికారులు ఆమెను ప్రశంసించారు.