రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన కొండా దంపతులు (వీడియోలు)

వరంగల్ తూర్పు నియోజకవర్గ తాజా మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ దంపతులు సొంత గూటికి చేరారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాందీ సమక్షంలో కొండా మురళి, సురేఖ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కొండా దంపతులు తమకు మూడు సీట్లు కావాలని కోరుతున్నా పొత్తుల కారణంగా కొండా సురేఖకు సీటు ఖాయం చేసినట్టు తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ లో 5 నియోజకవర్గాలను ప్రభావితం చేయగల కొండా దంపతులు తిరిగి సొంత గూటికి చేరడంతో కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం నెలకొంది. కొండా సురేఖ దంపతులు ఉత్తమ్ ఆధ్వర్యంలో ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్న వీడియోలు కింద ఉన్నాయి చూడండి. 

 

 

సమైఖ్య రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా సురేఖ బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. తర్వాత టిఆర్ ఎస్ లో చేరారు. కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకు వెళుతున్నట్టు ప్రకటించి అదే రోజున 105 మంది ఎమ్మెల్యే అభ్యర్ధులను ప్రకటించారు. దానిలో కొండా సురేఖ పేరు లేదు. దీంతో ఆగ్రహం చెందిన ఆమె తమకు రెండు రోజుల్లో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అయినప్పటికి ఎటువంటి సమాధానం రాకపోవడంతో మంగళవారం హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి టిఆర్ ఎస్ పై విరుచుకుపడ్డారు. బుధవారం ఢిల్లిలో రాహుల్ ని కలిసి కాంగ్రెస్ లో చేరారు.

తెలంగాణలో దొరల పాలన సాగుతోందని, ఉద్యమంలో పాల్గొన్న వారికి సరైన ప్రాధాన్యం లభించలేదని సురేఖ ఆరోపించారు. బీసీ మహిళ అయిన తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వకపోయినా పార్టీకి సేవ చేశానని.. అయినా తనకు ఎమ్మెల్యే టికెట్‌ కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన తనకు మంత్రివర్గంలో చోటు కల్పించకుండా నమ్మక ద్రోహం చేశారని, ఒక్క మహిళామంత్రి లేకుండా ప్రభుత్వాన్ని నడిపిన కేసీఆర్‌కు మహిళలపై ఉన్న గౌరవం ఏమిటో తెలుస్తోందన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు 10పేజీల లేఖను విడుదల చేశారు. తాను, తన భర్త ఎమ్మెల్సీ కొండా మురళి తెరాసకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. 

అనంతరం కాంగ్రెస్‌ నేతలతో సంప్రదింపులు జరిపిన వారిద్దరూ మంగళవారం రాత్రే దిల్లీకి చేరుకున్నారు. బుధవారం రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.