బ్రిటన్ విమానాలపై నిషేధం పొడిగింపు.. ఎప్పటి వరకంటే !

బ్రిటన్‌ లో కొత్తరకం కరోనా వైరస్‌ స్ట్రెయిన్ విజృంభణతో బ్రిటన్ నుండి విమానాల రాకపోకలపై భారత్ తాత్కాలికంగా నిషేధం విధించిన విషయం తెలిసిందే. తొలుత డిసెంబరు 31 వరకు నిషేధం విధించారు. తాజాగా, దానిని జనవరి 7 వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

Flight Ticket Prices May Increase From September, Here

ఈ మేరకు ట్విటర్‌ లో హర్దీప్ సింగ్ పురి ప్రకటన చేశారు. కేంద్ర ఆరోగ్యశాఖ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వందే భారత్‌ మిషన్‌ ద్వారా ఇప్పటి వరకు 42 లక్షల మంది భారతీయులను విదేశాల నుంచి తీసుకొచ్చినట్టు మంత్రి పేర్కొన్నారు. వీరిలో అత్యధికంగా కేరళకు 8 లక్షల మంది, తెలంగాణకు మొత్తం 1,84,632 మంది వచ్చినట్లు వెల్లడించారు. కరోనా‌కు ముందు 40 దేశాలకు రాకపోకలు సాగించిన ఎయిర్‌ ఇండియా, కరోనా సమయంలో 75 దేశాల నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చిందన్నారు.

బ్రిటన్‌‌ లో కొత్తరకం వైరస్‌ వ్యాపిస్తున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తమయ్యింది. ఈ స్ట్రెయిన్‌ను పసిగట్టి, వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. డిసెంబరు 9 నుంచి 22 మధ్య భారత్‌కు వచ్చి, పాజిటివ్‌గా తేలిన అంతర్జాతీయ ప్రయాణికుల్లో వైరస్‌ జన్యు క్రమాన్ని తెలుసుకునేందుకు పరీక్షలు నిర్వహిస్తోంది.