గోవా సీఎం పారికర్ కన్నుమూత

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ (63) కన్నుమూశారు. ఏడాది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పారికర్ ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నా రు. పారికర్ భార్య 2001లోనే మరణిం చారు. నాలుగుసార్లు గోవా ముఖ్యమంత్రిగా, మూడేండ్లపాటు రక్షణ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన పారికర్ ఏడాది కాలంగా క్లోమగ్రంథి క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.

తన ఇంట్లోనే తాత్కాలికంగా ఏర్పాటు చేసిన దవాఖానలో కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్న పారికర్ ఆరోగ్యం శనివారం సాయంత్రం ఆకస్మికంగా విషమించింది. దీంతో ఆయనకు కృత్రిమ శ్వాసను అందించారు. ఆదివారం సాయంత్రం 6.40 గంటలకు పారికర్ కన్నుమూశారని రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఒక సీనియర్ అధికారి వెల్లడించారు.

గత ఏడాది ఫిబ్రవరి నుంచి పారికర్ గోవా, ముంబై, ఢిల్లీ, న్యూయార్క్‌లోని పలు దవాఖానలలో చికిత్స పొందారు. గోవాకు నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన పారికర్ గత జనవరిలో తుది శ్వాస విడిచేవరకూ గోవాకు సేవ చేస్తాను అని చెప్పారు.