కొడుకుని సిగరెట్లతో వాతలు పెట్టి కాల్చి చంపిన తండ్రి

టెక్నాలజీ ఎంత పెరిగినా భూత వైద్యం, మూఢ నమ్మకాల్లో మాత్రం ప్రజల్లో మార్పు రావడం లేదు. చదువుకోని వారికంటే చదువుకున్న వారే దీనిని పాటించడం సిగ్గుచేటు. తాజాగా కర్నాటకలో ఘోరం జరిగింది. కొడుకు ఎదుగుదల సరిగా లేదని భూత వైద్యున్ని సంప్రదించిన తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటంటే…

కర్నాటకలోని కోలారు జిల్లా మాలూరుకు చెందిన హరీష్, రేణుకలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి పృథ్వీ అనే మూడేళ్ల బాలుడు ఉన్నారు. హరీష్ ప్రైవేటు బస్సు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. పృథ్వీకి మూడు సంవత్సరాలు వచ్చినా వయసుకు తగ్గట్టు ఎదుగుదల లేదని భూత వైద్యున్ని సంప్రదించారు.

భూత వైద్యుని సలహాతో గత వారం రోజులుగా సిగరెట్లతో కొడుకు ఒంటి పై వాతలు పెట్టాడు. మూడు రోజుల కింద గుడికి తీసుకపోయి స్నానం చేయించారు. దాంతో ఒంటి మీద ఉన్న గాయాలు  పుండ్లలాగా మారాయి. దీంతో బాలునికి తీవ్ర జ్వరం రాగా అప్పుడు ఆస్పత్రకి తరలించారు. అప్పటికే తీవ్ర అస్వస్థతతో ఉన్న బాలుడు చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ఘటన పై బాలుని తాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భార్య భర్తలిద్దరు శాడిస్టులుగా ప్రవర్తించేవారని స్థానికులు ఆరోపించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.