చంద్రయాన్‌-3: థ్యాంక్స్‌ మెసేజ్ పంపిన విక్రమ్‌!

చంద్రుడిపై అడుగుపెట్టడమే లక్ష్యంగా రోదసిలోకి దూసుకెళ్లిన భారత వ్యోమనౌక చంద్రయాన్‌-3 మరో కీలక ఘట్టాన్ని పూర్తిచేసుకుంది. ఇందులో భాగంగా తాజాగా ఈ రోజు ఈ వ్యోమనౌకలోని ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి ల్యాండర్‌ మాడ్యూల్‌ “విక్రమ్‌” విజయవంతంగా విడిపోయింది. దీంతో త్వరలో చంద్రుడి ఉపరితలంపై దిగే చరిత్రాత్మక ఘట్టానికి ఇది సిద్ధమైంది.

అవును… చంద్రయాన్ ప్రయాణంలో భాగంగా అంతరిక్ష నౌక కక్ష్యలో తన వ్యాసాన్ని తగ్గించుకుంటూ వస్తూ ఇవాళ చంద్రుడి సమీపానికి చేరుకుంది. దీంతో అంతరిక్ష నౌకలోని ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విక్రమ్ ల్యాండర్ విడిపోయింది. ఇక విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపైకి సాఫ్ట్ ల్యాడింగ్ కావడమే ఈ ఘట్టంలో మిగిలుంది. అంతా సాఫీగా జరిగితే ఈ నెల 23న ఆ పని కూడా అయిపోతుంది.

ఈ విషయాలపై తాజాగా బెంగళూరులోని ఐ.ఎస్‌.టీ.ఆర్‌.ఏ.సీ. కేంద్రం ట్విట్టర్ లో కీలక విషయాలు వెల్లడించింది. ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి విజయవంతంగా విడిపోయిన తర్వాత ల్యాండ్‌ మాడ్యూల్‌ పంపిన సందేశాన్ని తెలిపింది. “థ్యాంక్స్‌ ఫర్‌ ది రైడ్‌, మేట్” అని ల్యాండర్‌ మెసేజ్‌ పంపినట్లు ఇస్రో ట్విటర్‌ లో ప్రకటించింది. ఇందులో భాగంగా

ఈ ప్రక్రియ పూర్తవడంతో ఇక నుంచి ల్యాండర్‌ మాడ్యూల్‌ చంద్రుడిని సొంతంగా చుట్టేస్తుంది. దీంతో… ఆగస్టు 18 సాయంత్రం 4 గంటలకు డీఅర్బిట్‌-1 ప్రక్రియ చేపట్టనున్నట్లు ఇస్రో తెలిపింది. ఆ తర్వాత ఈ నెల 20న మరోసారి డీఆర్బిట్‌-2 ప్రక్రియ చేపడుతారు. ఈ ప్రక్రియలతో ల్యాండర్‌ వేగాన్ని క్రమంగా తగ్గిస్తారు.

ఈ క్రమంలో చంద్రుడిని తాకే సమయానికి ల్యాండర్‌ నిలువు వేగం సెకనుకు 2 మీటర్లు, హారిజాంటల్‌ వేగం సెకనుకు 0.5 మీటర్ల కన్నా తక్కువగా ఉండేలా చూసుకోనున్నారు.

కాగా… “చంద్రయాన్‌-3″ని జులై 14న ఎల్‌.వీ.ఎం3-ఎం4 రాకెట్‌ ద్వారా ఇస్రో విజయవంతంగా భూకక్ష్యలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారమే చంద్రయాన్‌-3 చివరి దశ కక్ష్యలోకి ప్రవేశించగా.. నేడు ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి ల్యాండర్‌ విడిపోయింది.

ఈ సమయంలో అంతా సజావుగా సాగితే ఈ నెల 23న సాయంత్రం 5.47 గంటల సమయంలో ల్యాండర్‌ చంద్రుడిపై అడుగుపెట్టనుందని ఇస్రో వెల్లడించింది. ఈ సమయం కోసం భారతీయులతో పాటు ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోంది!