అగ్ర వర్ణ పేదలకు కేంద్రం గుడ్ న్యూస్

ఆర్ధికంగా వెనుకబడిన అగ్ర కులాల వారికి 10 శాతం రిజర్వేషన్లు పెంచుతూ కేంద్ర కేబినేట్ ఆమోదించింది. విద్య ఉద్యోగాల్లో ఆర్ధికంగా వెనుకబడి ఉన్న అగ్రకులాల వారికి ఈ రిజర్వేషన్లు వర్తించనున్నాయి. ప్రస్తుతం ఉన్న 50 శాతం రిజర్వేషన్లను 60 శాతానికి పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేయనుంది.

అగ్రవర్గ కులాల వారికి రిజర్వేషన్లు కల్పించాలని దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలల్లో ఆందోళనలు నిర్వహించారు. గుజరాత్ లో పటేల్ లు తమ రిజర్వేషన్ల కోసం చేసిన పోరాటం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తెలంగాణలో రెడ్లు తమకు రిజర్వేషన్లు కల్పించాలని పోరాడారు. రెడ్డి జాగృతి తరపున అనేక ఉద్యమాలు నిర్వహించారు. ఒకానొక దశలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. రెడ్డి జాగృతి తరపున అసెంబ్లీ ముట్టడి కూడా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ లో కాపులు కూడా తమ రిజర్వేషన్ల పెంచాలని పోరాటం చేశారు. మహారాష్ట్ర, రాజస్థాన్ లలో కూడా ఈ డిమాండ్ ఉంది. దీంతో కేంద్ర కేబినేట్ ఆర్ధికంగా వెనుకబడిన అగ్రకులాల వారికి రిజర్వేషన్లు పెంచాలని నిర్ణయం తీసుకుంది. మంగళవారం లోక్ సభలో అగ్రవర్ణాల రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టనుంది.  

ఐదెకరాలకంటే ఎక్కవ పొలం ఉన్నవారు ఈ రిజర్వేషన్లకు అనర్హులు. ఏడాదికి 8 లక్షల లోపు ఇన్ కం ఉన్న వారే అర్హులు. 1000 చ.మీటర్ల ఇల్లు ఉంటే రిజర్వేషన్లకు అర్హులు కారని కేంద్రం స్పష్టం చేసింది. ఈబిసిలకు విద్య ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నారు. పార్లమెంటులో బిజెపికి మెజార్టీ సభ్యులు ఉండడంతో బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉంది.  

కేంద్రం నిర్ణయాన్ని తప్పు బట్టిన  ఓవైసీ 

ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లు పెంచడాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తప్పు పట్టారు. ట్విట్టర్ లో ఒవైసీ స్పందిస్తూ.. ఏమన్నారంటే

   ‘దళితులకు జరిగిన చారిత్రక అన్యాయాన్ని సరిచేసేందుకు రిజర్వేషన్లను తీసుకొచ్చారు. పేదరికాన్ని అరికట్టడానికి చాలా పథకాలు, కార్యక్రమాలు తీసుకునిరావొచ్చు. కానీ రిజర్వేషన్లు అన్నవి న్యాయానికి ఉద్దేశించినది. ఆర్థిక కారణాల ఆధారంగా రిజర్వేషన్లను ఇవ్వలేం’ అని తేల్చిచెప్పారు. ప్రస్తుతం కేంద్రం 49.5 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఈ రిజర్వేషన్లు 50 శాతం దాటేందుకు వీలులేదు.” అని ఆయన ట్వీట్ చేశారు. 

మరో వైపు బిసి ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య రిజర్వేషన్ల పెంపు పై స్పందించారు. మోదీకి దమ్ముంటే దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు. ఇష్టమొచ్చినట్టు రిజర్వేషన్లు మారుస్తామంటే  ఒప్పుకొమన్నారు. 

ఎన్నికల జిమ్మిక్కు కోసమే బిజెపి రిజర్వేషన్లు పెంచిందని కాంగ్రెస్ నేత మాజీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. 50 శాతానికి మించి రిజర్వేషన్లు కల్పించవద్దని సుప్రీం తీర్పు ఇచ్చిందని అటువంటప్పుడు ఇదేలా సాధ్యమవుతుందన్నారు. 2014 నుంచి గుర్తుకు రాని రిజర్వేషన్లు ఇప్పుడే ఎందుకు వచ్చాయని ఆయన ప్రశ్నించారు.