ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఎప్పటికప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తలలో నిలుస్తుంటారు. లోక్ సభలో జమ్మూకశ్మీర్ విభజన చట్టం సవరణ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా అసద్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం భవిష్యత్తులో హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే ప్రమాదం ఉందన్నారు. చెన్నై, బెంగళూరు, ముంబయి, అహ్మదాబాద్, లఖ్నో లనూ కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చేస్తారన్నారు. హైదరాబాద్ ను తన గుప్పిట్లోకి తీసుకునేందుకు కేంద్రపాలిత ప్రాంతంగా మార్చుతారని అన్నారు ఓవైసీ. నరేంద్ర మోదీ ప్రభుత్వం భవిష్యత్లో ఇదే నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉందని ఆయన అన్నారు.
బీజేపీకి మద్దతిచ్చే పార్టీలు భవిష్యత్ పరిణామాలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. జమ్మూకశ్మీర్లో 4జీ ఏమీ ప్రజలపై దయతలచి ఇవ్వలేదని, అమెరికా ఒత్తిడితోనే ఉన్నట్టుండి ఆ సౌకర్యం పునరుద్ధరించారన్నారు. అమెరికా ప్రకటన చేసిన రెండురోజుల్లోనే 4జీ ఇవ్వడం దేనికి సంకేతం? అంటూ ఆయన ప్రశ్నించారు. అక్కడి ప్రజల్లో మరింత అసంతృప్తి పెరుగుతుందన్నారు. జమ్మూకశ్మీర్ సమస్యను అంతర్జాతీయం చేయడం తప్పన్నారు ఓవైసీ.
లోక్సభ మొదటి విడత బడ్జెట్ సమావేశాలు శనివారం ముగిసిన విషయం తెలిసిందే. రెండో విడత సమావేశాలు తిరిగి మార్చి 8న ప్రారంభమై ఏప్రిల్ 8వ తేదీ వరకు జరగనున్నాయి. బడ్జెట్ సమావేశాలు సాధారణంగా రెండు విడతలుగా జరుగుతాయి. మొదటి విడతలో పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించడం, బడ్జెట్ ప్రవేశం పెట్టడం ఉంటాయి. రెండో విడతలో వివిధ శాఖలకు గ్రాంట్ల డిమాండ్లపై సంబంధిత స్టాండింగ్ కమిటీల పరిశీలన ఉంటుంది. ఫైనాన్స్ బిల్లు, సంబంధిత గ్రాంట్ల డిమాండ్ల ఆమోదం వంటివి ఉంటాయి.