`కాపీ క్యాట్‌`కు మ‌రో ఛాన్స్‌!

తాము అధికారంలోకి వ‌స్తే ఫ‌లానా సంక్షేమ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తాం, ఫ‌లానా అభివృద్ధి ప‌నులు చేస్తాం అని చెప్పుకోవ‌డం రాజ‌కీయ నేత‌ల‌కు అల‌వాటు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న పార్టీ.. ఈ విష‌యంలో ఓ అడుగు ముందే ఉండ‌టం స‌హ‌జం. ప్ర‌తిప‌క్షం.. ప్ర‌జల ప‌క్షం. అధికార పార్టీ త‌ప్పుల‌ను జ‌నంలోకి తీసుకెళ్తూంటుంది. క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జ‌ల బాగోగుల‌ను చూస్తూంటుంది.

అధికార పార్టీ అమ‌లు చేస్తోన్న సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు తీరుపై ఓ క‌న్నేసి ఉంచుతుంది. ఇంకా ఎలాంటి ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తే సామాన్యుల జీవితాలు బాగుప‌డ‌తాయ‌నే విష‌యంపై స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌నకు వ‌స్తుంది. ఈ ఉద్దేశంతోనే అధికార పార్టీ కంటే కూడా ప్ర‌తిప‌క్షం కొన్ని మెరుగైన హామీల‌ను ఇస్తుంద‌న‌డంలో సందేహాలకు అవకాశ‌మే ఉండ‌దు.

ఈ క్ర‌మంలోనే- ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కూడా `న‌వ‌ర‌త్నాలు` పేరుతో సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌క‌టించారు. తాను అధికారంలోకి వ‌చ్చిన మ‌రుక్ష‌ణ‌మే వాటిని అమ‌లు చేస్తాన‌ని చెప్పారు. ఈ విష‌యంలో ఆయ‌న‌కు ఉన్న నిబ‌ద్ధ‌త‌ను, చిత్త‌శుద్ధిని శంకించ‌లేం. ప్ర‌తిప‌క్షం ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాల్లో ఓ రెండింటిని అధికార పార్టీ కాపీ కొట్టింది.

తాను అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే అవ్వా, తాత‌ల పింఛ‌న్‌ను రూ.2000ల‌కు పెంచుతాన‌ని ప్ర‌క‌టించారు జ‌గ‌న్‌. దాన్ని అచ్చంగా అమ‌ల్లోకి తీసుకొచ్చింది చంద్ర‌బాబు ప్ర‌భుత్వం. అదెంత మాత్రం అమ‌ల‌వుతోంద‌న్న విష‌యాన్ని ప‌క్క‌న‌పెడితే.. దాన్ని కాపీ కొట్టిన చంద్ర‌బాబుకు కాపీ క్యాట్ అనే ముద్దు పేరు పెట్టారు నెటిజ‌న్లు. దీనితో ఆటోల‌పై లైఫ్‌ట్యాక్స్ మిన‌హాయింపు కూడా.

తాజాగా- చంద్ర‌బాబు కాపీ కొట్ట‌డానికి మ‌రో ఛాన్స్ వ‌చ్చింది. అదే..పేద‌ల‌కు క‌నీస ఆదాయాన్ని క‌ల్పించే ప‌థ‌కం. తాము కేంద్రంలో అధికారంలోకి వ‌స్తే దేశంలోని పేద‌లందరికీ క‌నీస ఆదాయాన్ని క‌ల్పిస్తామ‌ని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్ర‌క‌టించారు. గ్రామీణ స్థాయిలో ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునే ప‌థ‌క‌మే ఇది.

కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే దీన్ని స‌మ‌ర్థ‌వంతంగా అమ‌లు చేయ‌గ‌ల‌దు కూడా. ఎందుకంటే- మ‌హాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించింది కూడా కాంగ్రెస్సే. ఆ ప‌థ‌కం ఇప్పుడు గ్రామీణుల‌కు ఎంతో కొంత మేలు చేస్తోంది. ఉపాధిని క‌ల్పిస్తోంది. ఆర్థిక స్వావ‌లంబ‌న‌కు ఊతమిస్తోంది. దీన్ని కూడా త‌మ ప‌థ‌కంగా చెప్పుకొంటోంది చంద్ర‌బాబు ప్ర‌భుత్వం.

అద‌లావుంచితే- రాహుల్ గాంధీ ప్ర‌క‌టించిన క‌నీస ఆదాయ భ‌రోసా ప‌థ‌కంపై చంద్ర‌బాబు క‌న్ను ప‌డిన‌ట్టే క‌నిపిస్తోంది. గురువారం అమ‌రావ‌తిలో జ‌రగ‌బోయే మంత్రివ‌ర్గ స‌మావేశంలో ఈ ప‌థ‌కంపై చ‌ర్చిస్తార‌ట‌. మంత్రివ‌ర్గ స‌మావేశం ముగిసిన త‌రువాత క‌నీస ఆదాయ భ‌రోసా ప‌థ‌కంపై ఓ క్లారిటీ ఇస్తార‌ని అంటున్నారు.

ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వెలువడ‌టానికి ఇక ఎంతో స‌మ‌యం లేనందున‌, అధ్య‌య‌నాల పేరుతో కాల‌యాప‌న చేయ‌కుండా.. ఈ ప‌థ‌కాన్ని వెంటనే అమ‌ల్లోకి తెచ్చేలా చేయ‌డమో, లేదా అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే దీనిపైనే తొలి సంత‌కం పెడ‌తామ‌ని హామీ గుప్పించ‌డ‌మో చేయ‌వ‌చ్చ‌ని తెలుస్తోంది.

లేదూ! క‌నీస ఆదాయ భ‌రోసా ప‌థ‌కాన్ని యాంక‌ర్‌గా తీసుకుని తెలుగుదేశం పార్టీ ఎన్నిక‌ల బ‌రిలో దూకొచ్చ‌ని కూడా మ‌నం అంచ‌నా వేసుకోవ‌చ్చు. తెలుగుదేశం పార్టీని 2014 ఎన్నిక‌ల్లో ఒడ్డెక్కించింది రైతు, డ్వాక్రా రుణాల మాఫీ హామీ. ఈ హామీ నీటి మూటే అనే విష‌యం జ‌నాల‌కు కాస్త ఆల‌స్యంగా అర్థ‌మైంది.

మ‌ళ్లీ- ఇదే హామీతో ఎన్నిక‌లకు వెళ్తే ఓట‌ర్లు బుట్ట‌లో ప‌డే అవ‌కాశ‌మే లేద‌ని భావిస్తోన్న తెలుగుదేశం పార్టీకి రాహుల్ గాంధీ ఓ అయాచిత వ‌రాన్నిఇచ్చిన‌ట్టే ఉంది. తాము అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే క‌నీస ఆదాయ భ‌రోసా ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తామ‌ని, దీనిపైనే తొలిసంత‌కం పెడ‌తామ‌నీ చంద్ర‌బాబు ప్ర‌క‌టించినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు.