జనతా దళ్ (ఎస్ ) మీద మరొక దెబ్బ వేసిన సుమలత

కర్నాటకలో నటి సుమలత జనతా దళ్ (ఎస్ ) మీద మరొక దెబ్బ వేసింది.

మాండ్య లోక్ సభ నియోజకవర్గం నుంచి నటి , కన్నడ రెబెల్ స్టార్ అంబరీష్ భార్య సుమలత ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

కాంగ్రెస్ టికెట్ ఆశించి ఆమె భంగ పడ్డారు. దానితో ఆగ్రహించిన సుమలత ఇండిపెండెంటుగా నామినేషన్ వేశారు. ఆమె ప్రత్యర్థి జనతా దళ్ (ఎస్ ) అభ్యర్థి నిఖిల్ కుమార స్వామి . ఆయన ముఖ్యమంత్రి కుమార స్వామి కుమారుడు. కాంగ్రెస్, జెడిఎస్ లు సుమలతకు ప్రత్యర్థులుగా మారడంతో ఆమెకు బిజెపి మద్దతు ప్రకటించింది. బిజెపి మద్దతు అంటే ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం మద్దతే గా.

మొన్న మాండ్య జిల్లా కలెక్టర్ మీద సుమలత  ఫిర్యాదు చేశారు. చేసిన 24 గంటల్లోపే ఎన్నికల కమిషనర్ కలెక్టర్ ఎన్ మంజుశ్రీని ఎన్నికల కమిషన్  బదిలీ చేశారు. నామినేషన్లను స్వీకీరించేటపుడు మంజుశ్రీ ఏకపక్షంగా వ్యవహరించారనేది సుమలత ఫిర్యాదు.

నిఖిల్ నామినేషన్ పేపర్లు సరగ్గా లేకపోయినా కలెక్టర్ వాటిని ఆమోదించారని ఇది చెల్లదని, ఈ వ్యవహారంలో మంజుశ్రీ పక్షపాతంతో వ్యవహరించారనేది ఆమె కమిషన్ కు ఫిర్యాదు చేశారు.

నిఖిల్ సమర్పించిన నామినేషన్ పత్రాలలో ఫామ్ నెంబర్ 26 (అఫిడవిట్ ),కాలమ్ 7, 7A, 8 లేవని తన ఎన్నికల ఏజంటు చెప్పినా కలెక్టర్ వినలేదని. ఈ లోపాలున్నా కలెక్టర్ మంజుశ్రీ ముఖ్యమంత్రి కుమార స్వామి కుమారుడి నామినేషన్ ను స్వీకరించరాని ఆమె ఎన్నికల కమిషన్ రాసిన లేఖ లో పేర్కొన్నారు.

ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం నామినేషన్ల స్క్రుటినీ లోపు ఈ ఫారాలను సమర్పించవచ్చని కలెక్టర్ వాదించి నామినేషన్ ను స్వీకరించారని ఆమె అంటున్నారు. ఒక సారి రిటర్నింగ్ అధికారి స్క్రుటినీ తర్వాత నామినేషన్ స్వీకరించాక దీనికి పరిష్కారం కోర్టుల ద్వారానే సాధ్యం.

సుమలత ఆందోళన తాము అర్థం చేసుకున్నామని, మాండ్యను సందర్శించినపుడు నిఖిల్ నామినేషన్ల మీద నెలకొన్న గందరగోళం గురించి తెలిసిందని కర్నాటక చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ సంజీవ్ కుమార్ తెలిపారు. అనంతరం మంజుశ్రీ బదిలీ జరిగింది.

తనకు న్యాయం జరగకుండా చూసేందుకు జెడిఎస్ అధికార యంత్రాంగాన్ని దుర్వినయోగం చేస్తున్నదని సుమలత ఫిర్యాదులో పేర్కొన్నాారు.

సుమలత చేసిన ఆరోపణల మీద ఎన్నికల కమిషన్ దర్యాప్తు జరుపుతుందని సంజీవ్ కుమార్ చెప్పారు.

రాష్టంలో చాలా మంది ఎన్నికల అధికారులను బదిలీచేయాలని బిజెపి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. దీనిప్రకారం బదిలీలు జరుగుతున్నాయి. మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు, రాష్ట్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంటు మంత్రి రేవన్ణ కుమారుడు ప్రజ్వల్ పోటీ చేస్తున్ హసన్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి , జిల్లా కలెక్టర్ అక్రమ్ పాషాను ఎన్నికల కమిషన్ బదిలీ చేసింది. హసన్ బిజెపి ఎమ్మెల్యే ప్రీతమ్ గౌడ చేసిన ఫిర్యాదు మేరకు పాషాను బదిలీ చేశారు.