మహారాష్ట్రలో ఘోరప్రమాదం.. 16 మంది దుర్మరణం !

మహారాష్ట్రలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 16 మంది మరణించినట్లు సమాచారం. జల్గావ్ జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బొప్పాయిలతో వెళ్తున్న ఐషర్ ట్రక్కు జల్గావ్‌ జిల్లాలోని కింగ్వాన్‌ వద్ద బోల్తా పడింది. దాంతో ట్రక్కులో ఉన్న కూలీల్లో 16 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరణించిన వారిలో ఏడుగురు పురుషులు, ఆరుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది.

బాధితులను ఈ జిల్లాలోని అభోడా, కేర్హళ, రావెర్ గ్రామాలకు చెందిన వారిగా గుర్తించారు. మహారాష్ట్రలోని ధూలే నుంచి రేవర్‌కు అరటిలోడుతో వెళ్తున్న ట్రక్కు కింగ్వాన్ సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో మొత్తం 21 మంది కార్మికులు ఉన్నారు. ప్రమాదంలో మరో ఐదుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.

గాయపడిన వారిని జల్గావ్‌ ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అర్ధరాత్రి ఈ ప్రమాదం జరగడంతో సమాచారం ఆలస్యంగా తెలిసింది. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం తరలించారు.