కరోనా రూపంలో మూడవ ప్రపంచ యుద్ధం ? గెలుపు ఎవరిది?

ప్రధమ ద్వితీయ ప్రపంచ యుద్దాలు ప్రపంచంలోని వివిధ దేశాల మధ్య జరిగాయి. రాజ్య కాంక్ష సామ్రాజ్యవాదంతో కూడిన దోపిడీ విధానం ఈ యుద్ధాలకు ప్రాతిపదిక అయితే మూడవ ప్రపంచ యుద్ధ ఛాయలు ఇటీవల వరకు ప్రచ్చన్న రూపంలో మనల్ని వెంటాడు తుండినాయి. మరీ అణుయుద్దం మెడమీద కత్తిలాగా వేలాడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం నిజంగానే మూడవ ప్రపంచ యుద్ధం అన్ని దేశాల పీకల మీదకు వచ్చిపడింది.

అది కోవిడ్ 10 (కరోనా) రూపంలో ప్రపంచంలోని అన్ని దేశాలను చుట్టుముడుతోంది. గతంలో ఒక దేశం మరొక దేశాన్ని సర్వ నాశనం చేస్తే కరోనా మహమ్మారి అన్ని దేశాలను సామ్రాజ్యవాద దేశాలు వలస దేశాలు ధనిక పేద దేశాలని కాకుండా చుట్టుమడుతోంది. తెలుగు రాష్ట్రాలకు వస్తే తెలుగు సాహిత్యంలో కాల ఙ్జానానికి పెద్ద పీట వుంది. ఈలాంటి మహమ్మారులు విజృంభించి జన క్షీణత సంభవించుతుందని సంప్రదాయ వాదులు చెబుతుంటారు.అయితే ఇప్పుడు హేతవాదులేమో కరోనా రూపంలో మూడవ ప్రపంచ యుద్ధంలాంటిది విరుచుకు పడుతోందని భారీ ఎత్తున ఆర్థిక ఆరోగ్య విధ్వంసం సంభవించుతుందని భావిస్తున్నారు. మరీ వైద్య సేవలు అతి తక్కువ వుండే భారత దేశం లాంటి దేశాల్లో ఈ విధ్వంసం ఎక్కువగా వుంటుందని చెబుతున్నారు.

మరో వేపు కాల ఙ్జానం విశ్వసించే సనాతన వాదులు వీర బ్రహ్మేంద్రస్వామి లాంటి వారు చెప్పినట్లు ఈశాన్యంలో ఈ పెను ప్రమాదం పుట్టుకొస్తుందని (ఈశాన్యంలో చైనా వుంది) ప్రపంచాన్ని సర్వ నాశనం చేస్తుందని కథలు కథలుగా చెబుతున్నారు. ఇవన్నీ అటుంచితే ఒక్కటి మాత్రం నిజం. చైనా ఇతర యూరోపియన్ దేశాల్లాగా భారత దేశం లాంటి దేశాలు చైనాలో లాగా కరోనా విస్తరించితే అదుపు చేసే అవకాశాలు తక్కువని జనం పిట్టలులాగా రాలి పోవలసిందే. తెలంగాణలో వాస్తవంలో ఎన్ని పాజిటివ్ కేసులు వచ్చాయే ఏమో గాని రెండు రోజుల్లో వందల మంది ఆసుపత్రులకు క్యూ కట్టారు. అప్పుడే ఆంధ్ర ప్రదేశ్ లో 11 అనుమానిత కేసులు వచ్చాయి. కాని ప్రపంచాన్ని చుట్టుముడుతున్న కరోనా నిరోధం గురించి బుధవారం జరిగిన మంత్రి వర్గ సమావేశం కూలంకషంగా చర్చించ లేదు. ఆంధ్ర ప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఈ మహమ్మారి విస్తరించకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. దురదృష్టం కొద్దీ వ్యాపించితే అదుపు చేసే సామర్థ్యం ఏమాత్రం లేదనే అంశం గుర్తించడం లేదు.