యాత్ర 2.. టార్గెట్ ఫిక్స్?

మహి వి రాఘవ దర్శకత్వంలో 2019 ఎన్నికలకి ముందు వచ్చిన యాత్ర మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. వైఎస్ఆర్ పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన ఆ మూవీకి ప్రేక్షకులు భాగా కనెక్ట్ అయ్యారు. ఇక ఆ సినిమా వైసీపీ గెలుపుకి కూడా ఎంతో కొంత కారణం అయ్యిందని చెప్పాలి. మరల 2024 ఎన్నికలకి ముందు యాత్ర 2 మూవీకి సన్నాహాలు చేస్తున్నారు.

మహి వి రాఘవ తాజాగా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. యాత్ర 2 మూవీ కచ్చితంగా ఉంటుందని, త్వరలో దానిపై క్లారిటీ ఇస్తానని చెప్పారు. ఇక రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలు, ప్రజలలోకి వెళ్ళిన విధానం ఈ యాత్ర 2 కథాంశంగా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కంటెంట్ లో కూడా బలమైన సంఘర్షణలు ఉన్న నేపథ్యంలో ఆడియన్స్ కి రీచ్ అవుతుందని నమ్ముతున్నారు.

బాలీవుడ్ నటుడు ప్రతీక్ గాంధీని జగన్ పాత్ర కోసం ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారంట. ఈ యాత్ర 2ని ఎన్నికల ముందు తీసుకురావడం ద్వారా రాజకీయంగా కూడా జగన్ కి ప్లస్ అవుతుందనే అంచనా వేస్తున్నారు. అయితే రాజకీయాలలో ఒక సామెత ఉంటుంది. రెండు ప్లస్ లు ఎప్పుడు ప్లస్ కావు. అయితే యాత్ర 2 విషయంలో ఫలితం ఎలా ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేని విషయం.

అయితే ఎన్నికల ముందు ఇటు ఆర్జీవీ కూడా ఏపీ రాజకీయాల నేపథ్యంలో రెండు సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అలాగే యాత్ర 2 కూడా వచ్చే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. దీంతో పాటు బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా అఖండ 2 కూడా వచ్చే ఛాన్స్ ఉందంట.

ఈ మూవీ కూడా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లోనే నడిచే కథ. ఇలా టాలీవుడ్ నుంచి ఏపీ రాజకీయాల చుట్టూ తిరిగే కథలతో నాలుగు సినిమాల వరకు రిలీజ్ కానున్నాయి. వీటిలో ఏవి ఎవరికి పాజిటివ్ అవుతయనేది ప్రజా నిర్ణయం బట్టి తెలుస్తుంది అని చెప్పొచ్చు.