సందీప్ ‘రౌడీ బేబీ’ ప్రారంభం !

సినీ కెరీర్‌ ప్రారంభం నుండి వైవిధ్యమైన సినిమాలు, పాత్రలకు ప్రాధాన్యం ఇస్తూ కథానాయకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను దక్కించుకున్న సందీప్‌ కిషన్‌ లేటెస్ట్‌ మూవీ ‘రౌడీబేబీ’.. ఈ సినిమా షూటింగ్‌ బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత ఎంవీవీ సత్యనారాయణ క్లాప్‌ కొట్టగా, సహ నిర్మాత జీవీ క్లాప్‌ కొట్టారు.

రౌడీబేబీ స్టార్ట్ చేసిన సందీప్ కిషన్

కోన వెంకట్‌ ముహూర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. రాజమండ్రి పార్లమెంట్‌ సభ్యుడు మరగాని భరత్‌, పెందుర్తి ఎమ్మెల్యే అదిప్‌రాజ్‌, గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి, గుడివాడ ఎమ్మెల్యే అమర్‌నాథ్‌ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమా పతాకాలపై కోన వెంకట్‌ సమర్పణలో జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జాతీయ అవార్డ్‌ విన్నింగ్‌ యాక్టర్‌ బాబీ సింహ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను కూడా ఈరోజు నుండే ప్రారంభిస్తున్నాం. ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రాలను తెరకెక్కించడంలో దిట్ట అయిన జి.నాగేశ్వరరెడ్డి మరోసారి తనదైన మార్క్‌తో రౌడీ బేబీ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.