కొన్నిరోజుల పాటు సినిమాలకు బ్రేక్‌.. సాయి ధరమ్‌ తేజ్‌ నిర్ణయం

సుప్రీం హీరో, మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ మంచి జోష్‌ లో ఉన్నాడు. ఆయనకు ఈ ఏడాది బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. విరూపాక్ష సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని అందుకున్నాడు. చాలా కాలం తర్వాత అతనికి దక్కిన హిట్‌ ఇది. అతని కెరీర్‌ లోనే ఎక్కువ వసూళ్లు రాబట్టిన సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఆ మూవీ తర్వాత వెంటనే తన మేనమామ, పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ తో కలిసి బ్రో మూవీలో నటించాడు.

ఈ మూవీ కూడా మంచి టాక్‌ అందుకుంది. అయితే, ఈ జోష్‌ లో ఆయన మరెన్ని మంచి సినిమాలు తీస్తారా అని అభిమానులు ఎదురుచూస్తున్న సమయంలో ఊహించని షాక్‌ ఇచ్చాడు. సాయిధరమ్‌ తేజ్‌ సినిమాలకు కొంత కాలం బ్రేక్‌ ఇవ్వాలి అని అనుకుంటున్నాడట. ఆయన అలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం లేకపోలేదు. కొంత కాలం క్రితం సాయి ధరమ్‌ తేజ్‌ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. కోలుకొని మళ్లీ సినిమాలు చేయడానికి చాలా కాలమే పట్టింది. ఆయన కోలుకున్న తర్వాత తీసిన సినిమానే విరూపాక్ష.

అయితే, ఆయనకు ఆ ప్రమాదం నాటి గాయాలు మళ్లీ ఇబ్బంది పెడుతున్నాయట. దీంతో, కొంత కాలం విశ్రాంతి తీసుకుంటే బాగుంటుందని ఆయన భావిస్తున్నారట. దీనిలో భాగంగానే కొంత కాలం సినిమాలకు బ్రేక్‌ ఇచ్చి, తన ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని అనుకుంటున్నారట. దాదాపు ఆరు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని ఫిక్స్‌ అయినట్లు తెలుస్తోంది. బ్రేక్‌ తర్వాతే ఆయన మరో కొత్త సినిమాకు సంతకం చేసే అవకాశం ఉంది.

అయితే, ఈ వార్త నిజానికి తేజ్‌ ఫ్యాన్స్‌ కి నిరాశ కలిగించే విషయమనే చెప్పాలి. అయితే, సినిమాల కంటే ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం ముఖ్యం కాబట్టి, ఫ్యాన్స్‌ అర్థం చేసుకునే అవకాశం ఉంది. మరి బ్రేక్‌ తర్వాత ఆయన ఎలాంటి సినిమాలతో అలరిస్తారో చూడాలి…