ర‌జ‌నీకాంత్ అభిమానుల‌కు గుడ్ న్యూస్.. మ‌రి కొద్ది నిమిషాల‌లో డిశ్చార్జ్‌!

మ‌రి కొద్ది రోజుల‌లో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ త‌న పార్టీ ప్ర‌క‌ట‌న‌కు సంబంధించి అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ చేస్తాడని అంద‌రు ఆస‌క్తిగా ఎద‌రు చూస్తున్న త‌రుణంలో ఆయ‌న అనారోగ్యానికి గురి కావ‌డం అభిమానుల‌లో ఆందోళ‌న క‌లిగించింది. హైబీపీ వ‌ల‌న ర‌జనీకాంత్ శుక్ర‌వారం జూబ్లిహిల్స్‌లోని అపోలో ఆసుప‌త్రిలో చేరారు. దాదాపు 48 గంట‌ల పాటు త‌లైవా ఆసుప‌త్రిలోనే ఉండగా, ప్ర‌త్యేక వైద్య బృందం అత‌నిని మానిట‌ర్ చేస్తుంది. అన్ని ర‌కాల ప‌రీక్ష‌లు జరిపి ఏవైన స‌మ‌స్య‌లు ఉన్నాయా అని ప‌రిశీలిస్తున్నారు.

గ‌త రాత్రి ర‌జ‌నీకాంత్ ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని, బిపీలో హెచ్చు త‌గ్గులు ఏమి లేవ‌ని అపోలో వైద్య బృందం తెలియ‌జేసింది. నిన్న జ‌రిపిన ప‌రీక్ష‌ల‌కు సంబంధించి కొన్ని రిపోర్ట్స్ ఈ రోజు రావ‌ల‌సి ఉండ‌గా, వాటిని ప‌రిశీలించాక త‌లైవాని డిశ్చార్జ్ చేయ‌నున్నార‌ట‌. ఇప్ప‌టికే బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో ర‌జ‌నీకాంత్ చార్ట‌ర్డ్ ఫ్లైట్‌ని సిద్దంగా ఉంచార‌ట‌. సాయంత్రం వ‌ర‌కు త‌లైవా త‌న కూతురితో క‌లిసి చెన్నై వెళ్ల‌నున్నారు. అయితే మ‌రి కొద్ది గంట‌ల‌లో ర‌జ‌నీకాంత్ తాజా ఆరోగ్య ప‌రిస్తితికి సంబంధించి మ‌రో హెల్త్ బులిటెన్ విడుద‌ల చేయ‌నున్నారు

ప్ర‌స్తుతం ర‌జ‌నీకాంత్ అన్నాత్తె అనే సినిమా చేస్తుండ‌గా,ఈ మూవీ షూటింగ్ కోసం ఇటీవ‌ల హైద‌రాబాద్ వ‌చ్చారు. కొద్ది రోజులు షూటింగ్ జ‌రిపిన త‌ర్వాత చిత్ర బృందంలో ఎనిమిది మందికి క‌రోనా పాజిటివ్ అని తేల‌డంతో షూటింగ్‌ని ఆపేశారు. అయితే ర‌జ‌నీకాంత్‌కు మాత్రం నెగెటివ్ వ‌చ్చిన కూడా ఆయ‌న హైద‌రాబాద్‌లోనే క్వారంటైన్‌లో ఉన్నారు. అనుకోకుండా శుక్ర‌వారం హై బీపీ రావ‌డంతో ర‌జ‌నీకాంత్‌ని అపోలోకు త‌ర‌లించారు. ప్ర‌స్తుతం ఆయ‌న కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవ‌లసి ఉన్న నేప‌థ్యంలో పార్టీ, సినిమాల విష‌యంలో అనేక సందేహాలు నెల‌కొన్నాయి.