యంగ్ హీరోపై ఫోకస్ పెట్టిన పూరి

టాలీవుడ్ లో స్టార్ దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న వ్యక్తి పూరి జగన్నాథ్. తెలుగు ఇండస్ట్రీకి నిజమైన హీరోయిజాన్ని పరిచయం చేసిన దర్శకుడిగా పూరికి మంచి గుర్తింపు ఉంది. కమర్షియల్ స్టార్ హీరో అనే ఇమేజ్ రావాలంటే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తే అనే విధంగా స్టార్ హీరోలు వరుసగా అతనితో సినిమాలు చేస్తూ వచ్చారు.

హీరోయిజంలో కొత్తదనం చూపిస్తూ సొసైటీలో ఒక రెబల్ గా తిరిగే వాడిని హీరోగా పూరి జగన్నాథ్ చూపిస్తూ ఉంటాడు. అలాగే అతని డైలాగ్స్ తోనే హీరోలకి ఎలివేషన్స్ తీసుకొస్తూ ఉంటాడు. పూరి జగన్నాథ్ డైలాగ్స్ కూడా యూత్ కి ఒక మోటివేషన్ లెసన్స్ తరహాలో ఉంటాయి. అందుకే పూరి జగన్నాథ్ సినిమాలలో కథ రొటీన్ గా ఉన్న ప్రేక్షకులు చూడటానికి ఇష్టపడతారు.

అయితే ప్రస్తుతం జెనరేషన్ కొత్తదనం కోరుకుంటున్నారు. థ్రిల్లర్ కథల కోసం చూస్తున్నారు. అలాగే కేజీఎఫ్ తరహాలో హీరోల ఎలివేషన్స్ ఉండాలని ఆశిస్తున్నారు. ఇక గత ఏడాది పూరి జగన్నాథ్ నుంచి వచ్చిన లైగర్ మూవీ డిజాస్టర్ అయ్యింది.

ఈ మూవీ ఫెయిల్ కావడానికి కారణం ఆయన స్టైల్ డైలాగ్స్ సినిమాలో లేకపోవడమే అనే మాట వినిపించింది. ఇదిలా ఉంటే లైగర్ ఫ్లాప్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న పూరి జగన్నాథ్ స్క్రిప్ట్ రెడీ చేసుకొని ఓ యంగ్ హీరోతో మూవీ చేయడానికి రెడీ అవుతున్నట్లు బోగట్టా. విజయ్ దేవరకొండ తర్వాత ఆ తరహా ఆటిట్యూడ్ తో దూసుకుపోతున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ కోసం పూరి చూస్తున్నట్లు టాక్.

రీసెంట్ గా విశ్వక్ దాస్ కా దమ్కీ మూవీతో హిట్ కొట్టాడు. మరో రెండు సినిమాల వరకు లైన్ లో పెట్టాడు. ఇక తాను రెడీ చేసుకున్న స్టొరీకి విశ్వక్ సేన్ అయితే కరెక్ట్ గా న్యాయం చేస్తాడని పూరి భావిస్తున్నట్లు టాక్. ఈ నేపధ్యంలో అతనిని కలిసి కథ చెప్పడానికి రెడీ అవుతున్నారు అనే మాట వినిపిస్తుంది.