పవన్ కళ్యాణ్‌తో చాలా కష్టం బాసూ.!

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అయిపోయారు. సినిమాల్లోనూ బిజీగానే వున్నారు. రెండు పడవల మీద బిజీ ప్రయాణం చాలా చాలా కష్టం. ఈ విషయం నిర్మాతలకీ తెలుసు. కానీ, కమిట్ అయ్యారు. ఇప్పుడేమో ఇబ్బంది పడుతున్నారు.

ఈ ఏడాదిలో ‘ఓజీ’ వచ్చేస్తుందట.. సంక్రాంతికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా వచ్చేస్తుందట.. ఇవీ నిన్న మొన్నటిదాకా జరిగిన ప్రచారాలు. 2024 ఎన్నికలకు ముందర ‘హరిహర వీర మల్లు’ కూడా వచ్చేస్తుందేమోనని గుసగుసలూ వినిపించాయి.

కానీ, ఏ సినిమా షూటింగ్ కూడా వేగంగా ముందుకు నడవడంలేదు. ‘హరి హర వీర మల్లు’ అయితే దాదాపుగా ఆగిపోయినట్టే. 2024 ఎన్నికల తర్వాత గానీ, ఆ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమయ్యే అవకాశాల్లేవు.

ఇక, ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ‘ఓజీ’ మాత్రం ఎలాగోలా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ముందు ముందు పవన్ కళ్యాణ్ ఇచ్చే డేట్లను బట్టి, ఈ సినిమాల్లో ఏదో ఒకటి సంక్రాంతి లోపు, ఇంకోటి సంక్రాంతి తర్వాత విడుదలయ్యేందుకు అవకాశాలు కాస్త వుండొచ్చు.

కానీ, అదీ కష్టమేనన్నది తాజా ఖబర్.! పవన్ కళ్యాణ్ మాత్రం, రెండు సినిమాలూ రిలీజ్ అయిపోతాయన్న ధీమాతో వున్నాడట. దర్శకులూ దానికి తగ్గట్టుగానే షెడ్యూల్స్ ఎప్పటికప్పుడు మార్చుకుంటూ, సరికొత్తగా డేట్స్ అడ్జస్ట్ చేసుకుంటున్నారట.

ఇవన్నీ చూస్తున్న ఆయా చిత్రాల నిర్మాతలు, పవన్ కళ్యాణ్‌తో కష్టం బాసూ.. అని తమ సన్నిహితుల వద్ద వాపోతున్నారు. అయినాగానీ, పవన్ కళ్యాణ్ సినిమాలకి అయ్యే బిజినెస్, వచ్చే లాభాలు (ఓటీటీ సహా ఇతర మార్గాల్లో) దృష్టిలో పెట్టుకుని, ఆయనతో సినిమాలకు ఇంకా కొత్తగా కమిట్ అవుతూనే వున్నారు.