పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్.! ఎటూ తేల్చుకోలేకపోతున్న ‘రత్నం’.!

పవన్ కళ్యాణ్ రాజకీయాలు, ఓ నిర్మాతకు తలనొప్పిగా మారాయ్. ఆ నిర్మాత కూడా పవన్ కళ్యాణ్‌కి అత్యంత సన్నిహితుడైన ఏఎం రత్నం. అందుకే, ఆయన గట్టిగా ఏమీ అనలేకపోతున్నాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘హరిహర వీరమల్లు’ సినిమాని తెరకెక్కిస్తున్న ఏఎం రత్నం, ఆ సినిమా ఆగిపోవడంతో ఒకింత గుస్సా అవుతున్నాగానీ, దాన్ని బయటకు తెలియనీయడంలేదు.

క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా ప్రారంభమైంది. మధ్యలో మరికొన్ని సినిమాలకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయగా, అవి మాత్రం కాస్త వేగంగానే పూర్తవుతున్నాయి. నిజానికి, ఆ సినిమాలూ కొంత అయోమయంలో పడ్డాయ్.. అది వేరే సంగతి.

ఎలాగోలా షూటింగ్ పూర్తయినవరకు, పార్ట్ వన్‌గా విడుదల చేసేద్దామని ఏఎం రత్నం విశ్వ ప్రయత్నాలూ చేస్తోంటే, ఆ ప్రయత్నాలకు బ్రేక్ వేశారట పవన్ కళ్యాణ్. ‘ఇప్పట్లో వద్దు..’ అని ఖరాఖండీగా తేల్చి చెప్పేశారట.

ఇప్పటికే, సినిమా నిర్మాణ ఖర్చు తడిసి మోపెడైపోయింది. ఇంకా చాలా ఖర్చు పెట్టాల్సి వుంది. ఎన్నికల తర్వాత పరిస్థితులు ఎలా మారతాయో తెలియదు.! ఏం చేయాలో ఏఎం రత్నంకి పాలు పోవట్లేదట.