ప్రముఖ నటి మృతి.. మలయాళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం!

మలయాళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ టీవీ నటి డాక్టర్‌ ప్రియ గుండెపోటుతో మరణించింది. 35 ఏళ్ల ప్రియ ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భిణి. అక్టోబర్‌ 31న రెగ్యులర్‌ ప్రెగ్నెన్సీ చెకప్‌ కోసం ఆసుపత్రికి వెళ్లిన ప్రియ ఉన్నట్టుండి అక్కడ ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు విడిచింది.

దీంతో వైద్యులు వెంటనే ఆమెకు ఆపరేషన్‌ చేసి బిడ్డను బయటకు తీశారు. శిశువును ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు ప్రియ మృతికి సంతాపం తెలుపుతున్నారు.

ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కాగా, మలయాళ టీవీ పరిశ్రమలో పాపులర్‌ నటులలో డాక్టర్‌ ప్రియ ఒకరు. ‘కరుతముత్తు’ పాపులర్‌ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే, వివాహమైన తర్వాత ఆమె నటనకు విరామం తీసుకుంది. ప్రియ వృత్తిరీత్యా డాక్టర్‌ కూడా. తిరువనంతపురంలోని పీఆర్‌ఎస్‌ ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేస్తోంది.

కాగా, సోమవారం కూడా మలయాళ ప్రముఖ నటి ఒకరు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. 35 ఏళ్ల రెంజూష మీనన్‌ బలవన్మరణానికి పాల్పడింది. తిరునంతపురంలోని తన ఫ్లాట్‌లో విగతజీవిగా కనిపించడం కలకలం రేపింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.