అనిల్ రావిపూడి నిర్మాతగా సక్సస్ అవుతాడా అంటూ అనుమానాలు..?

అనిల్ రావిపూడి టాలీవుడ్ లో ప్రస్తుతం మంచి క్రేజ్ ఉన్న దర్శకుడు. నందమూరి కళ్యాణ్ రాం హీరోగా తెరకెక్కిన పటాస్ సినిమాతో దర్శకుడిగా మారాడు అనిల్ రావిపూడి. ఫస్ట్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వరసగా సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు లాంటి సినిమాలతో వరసగా బ్లాక్ బస్టర్స్ ని అందుకున్నాడు. రాజమౌళి, కొరటాల శివ తర్వాత టాలీవుడ్ లో వరసగా సక్సస్ లు అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి మాత్రమే. ఇక అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమాలతో నిర్మాతలు మంచి లాభాలను చూశారు. అలాగే హీరోలకి సాలీడ్ హిట్స్ దక్కాయి.

కాగా సూపర్ హిట్ సినిమా ఎఫ్ 2 కి సీక్వెల్ గా ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్ 3 సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఎఫ్ 2లో నటించిన విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మిల్కీ బ్యూటీ తమన్నా.. యంగ్ బ్యూటీ మెహ్రీన్ ఎఫ్ 3 లోనూ నటిస్తున్నారు. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ సాగుతుండగా ఇప్పటికే ఎఫ్ 3 రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఎఫ్ 3 బిజినెస్ కూడా క్లోజ్ అయిందని సమాచారం.

కాగా దర్శకుడిగా మంచి ఫాం లో ఉన్న అనిల్ రావిపూడి నిర్మాతగా సక్సస్ అవుతాడా అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. గాలి సంపత్ అన్న సినిమాతో అనిల్ రావిపూడి నిర్మాతగా మారాడు. అనిల్ రావిపూడి సమర్పణలో షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి – హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీ విష్ణు – నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలలో నటించారు. మహా శివరాత్రి కానుకగా మార్చి 11న గాలి సంపత్ రిలీజ్ కానుంది. ఈ సినిమాకి మూడు సినిమాలు పోటీగా రిలీజ్ కాబోతున్నాయి. చూడాలి మరి గాలి సంపత్ నిర్మాతగా అనిల్ రావిపూడి కి ఎలాంటి అనుభవాన్ని ఇస్తుందో.