కొడుకు సినిమాని వంద సార్లు చూసిన ఇందిరా దేవి.. అంతగా నచ్చిన సినిమా ఏదో తెలుసా..?

సూపర్ స్టార్ కృష్ణ కుమారుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మహేష్ బాబు స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. ఇటీవల మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. తల్లి మృతి చెందటంతో మహేష్ బాబు ఆ బాధ నుండి ఇంకా బయటపడలేకపోతున్నాడు. మహేష్ బాబుకి అతని తల్లి ఇందిరా దేవికి మధ్య ఎంతో సన్నిహిత సంబంధం ఉండేది. ఇందిరా దేవికి అంతమంది పిల్లలు ఉన్నా కూడా మహేష్ బాబు అంటేనే ప్రాణం… అందువల్ల మహేష్ బాబుతోనే కలిసి ఉండేది. మహేష్ బాబు కూడా తన తల్లితో ఎక్కువ సమయాన్ని కేటాయించడానికి ప్రయత్నించేవాడు.

ఇందిరా దేవి తన కొడుకు మహేష్ బాబు ఇలా సూపర్ స్టార్ గా గుర్తింపు పొందడంతో ఎంతో ఆనందపడేదని.. తరచు తన కొడుకు నటించిన సినిమాలు చూస్తూ కాలక్షేపం చేసేదని సమాచారం. తాజాగా ఇందిరా దేవి గురించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహేష్ బాబు నటించిన అన్ని సినిమాల్లోకి ఇందిరా దేవికి “నిజం” సినిమా అంటే ఎంతో ఇష్టమని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో అమాయకంగా కనిపించే మహేష్ బాబు తన తల్లి మాట జవదాటని కొడుకుగా.. తల్లి అడుగుజాడల్లో నడుస్తూ కనిపించాడు.

అందువల్ల ఈ సినిమా అంటే ఇందిరా దేవికి చాలా ఇష్టమని ఈ సినిమాలో అమాయకంగా కనిపించే తన కొడుకుని చూసి మురిసిపోయేదని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో మహేష్ బాబు నటిస్తున్నాడు. ఇటీవల ఇందిరా దేవి మరణంతో ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది. తొందర్లోనే ఈ సినిమా షూటింగ్ పునః ప్రారంభించనున్నట్లు సమాచారం.