జమ్మూకశ్మీర్లోని పహల్గాం లోయలో మంగళవారం జరిగిన ఉగ్రదాడి దేశాన్ని కన్నీటిలో ముంచింది. పర్యాటకులపై పక్కా పన్నాగంతో జరిపిన దాడిలో ఇప్పటి వరకు 30 మంది ప్రాణాలు కోల్పోగా, మృతుల్లో ముగ్గురు తెలుగువారు ఉన్నారు. విశాఖకు చెందిన చంద్రమౌళి, కావలి వాసి మధుసూదన్, హైదరాబాద్కు చెందిన ఇంటెలిజెన్స్ అధికారికి ఉగ్రవాదుల కాల్పుల్లో బలయ్యారు. వీరంతా కుటుంబాలతో కలిసి పర్యటనకు వెళ్లిన సందర్భంలో ఈ విషాదం చోటుచేసుకుంది.
ఈ ఘోర ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్రంగా స్పందన వస్తోంది. పలు పార్టీల నేతలు, సామాన్యులు, సామాజిక వేదికల ద్వారా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లోని బీజేపీ నేతలు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు ఈటెల రాజేందర్, లక్ష్మణ్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు. ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయాల వద్ద మూడు రోజుల సంతాప దినాలు పాటించాలని సూచించారు.
ఈ నేపథ్యంలోనే స్పోర్ట్స్ ఫీల్డ్లోనూ స్పందన కనిపించింది. ఈ రోజు ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఒక నిమిషం నిశ్చలంగా మౌనం పాటించనున్నారు. అన్ని జట్ల ఆటగాళ్లు, అంపైర్లు నలుపు రిబ్బన్లు ధరించనున్నారు. ప్రత్యేకంగా… ఈ మ్యాచ్లో చీర్ లీడర్లను లేకుండా చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఐపీఎల్ చరిత్రలో ఇదొక అరుదైన సందర్భం.
ఘటన తీవ్రతతో తెలుగు రాష్ట్రాల్లో బాధితుల కుటుంబాల్లో విషాదం అలుముకుంది. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబసభ్యులు కన్నీటిలో మునిగిపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మృతదేహాలను స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పహల్గాం ఘటనపై దేశమంతా దిగ్బ్రాంతికి గురవుతుండగా… అమాయకులపై జరిపిన ఈ దాడికి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు పెరిగిపోతున్నాయి.