Kishan Reddy- Revanth Reddy: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి ఘాటు స్పందన

Kishan Reddy- Revanth Reddy: నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డీలిమిటేషన్ ప్రక్రియను రాజకీయం చేయవద్దని కాంగ్రెస్ పార్టీకి హితవు పలికారు. ఈ ప్రక్రియ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగబోదని ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు.

డీలిమిటేషన్ అంశంపై దక్షిణాది రాష్ట్రాల్లో వ్యక్తమవుతున్న ఆందోళనలపై కిషన్ రెడ్డి స్పందిస్తూ.. “మేము కూడా దక్షిణాది రాష్ట్రానికి చెందిన వాళ్లమే. ఇక్కడి రాష్ట్రాల హక్కులను, ప్రయోజనాలను దెబ్బతీయనివ్వం. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన ఈ ప్రక్రియ జరుగుతుంది. దీనికి కనీసం రెండేళ్ల సమయం పడుతుంది. కాబట్టి అనవసరమైన భయాందోళనలు సృష్టించవద్దు” అని పేర్కొన్నారు.

దక్షిణాది రాష్ట్రాల నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులు అయ్యారని, భవిష్యత్తులో డీలిమిటేషన్ జరిగితే వారికి ‘చప్రాసీ’ పదవి కూడా రాదన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు.

“ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారానికి ఒకసారి ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారో సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీలో ఏ పదవి కావాలన్నా ఢిల్లీకి డబ్బులు మోసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది” అని ఆరోపించారు.

బీజేపీలో కష్టపడే వారికి గుర్తింపు ఉంటుందని, కాంగ్రెస్ లాగా పైరవీలు ఉండవని చెబుతూ.. రేవంత్ రెడ్డి చేసిన ‘చప్రాసీ’ వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని ఎద్దేవా చేశారు.

మహిళా రిజర్వేషన్లపై రాజకీయం వద్దు:- మహిళా రిజర్వేషన్ల బిల్లును అమలు చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని, ఇలాంటి సున్నితమైన అంశాలను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం సరికాదని కిషన్ రెడ్డి హితవు పలికారు. దేశాభివృద్ధిలో భాగంగానే రాజ్యాంగబద్ధంగా ఈ ప్రక్రియలు సాగుతాయని ఆయన స్పష్టం చేశారు.

Tirupati 1993 Plane Crash: Chiranjeevi And Balakrishna | Telugu Rajyam