హిందీపరిశ్రమలో టాలెంట్‌కు స్థానం లేదు.. అలాంటి వారిని తీసి పక్కన పెడతారు: నటి కంగనా రనౌత్‌ సంచలన వ్యాఖ్యలు

హిందీ చిత్ర పరిశ్రమలో టాలెంట్‌ను ఎంకరేజ్‌ చేయరని అంటూ బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. టాలెంట్‌ ఉన్నవారికి ఇక్కడ ఎలాంటి గుర్తింపు లభించదని ఆరోపించారు. ప్రోత్సహించే వారు కూడా ఉండరన్నారు. నా దృష్టిలో బాలీవుడ్‌ ఒక నిస్సహాయ ప్రదేశం. ఈ పరిశ్రమకు చెందిన కొంతమంది ప్రముఖ వ్యక్తులు మనకు ఎలాంటి సాయం చేయరు. టాలెంట్‌ని చూసి వారు అసూయ పడతారు. ఎవరైనా టాలెంట్‌ ఉన్న వ్యక్తులు తమ దృష్టిలో పడితే తప్పకుండా వారి కెరీర్‌ నాశనం చేయడానికి చూస్తారు. పీఆర్‌లను నియమించి వారిపై దారుణంగా అవాస్తవాలు ప్రచారం చేయిస్తారు.

ఇండస్టీ వారిని బహిష్కరించేలా పరిస్థితులు సృష్టిస్తారు‘ అని కంగనా రనౌత్‌ ఆరోపించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. తాను అదే విధమైన పరిస్థితులు ఎదుర్కొన్నానని చెప్పారు. తనను బహిష్కరించారని పేర్కొన్నారు. ‘నా వరకూ నేను మంచి వ్యక్తిని. నా చుట్టూ ఉన్న వారితో మర్యాద పూర్వకంగా నడుచుకుంటా. ఎన్నికల్లోనూ విజయం సాధించా. ఇండస్టీ నుంచి ఎంతో ప్రేమాభిమానం పొందా. దీనిని బట్టి చూస్తే నాతో కొంతమందికి మాత్రమే సమస్య ఉంది. ఆ సమస్య నాలో ఉందా? లేదా వారిలో ఉందా? అనేది వారు కూడా ఒక్కసారి ఆలోచిస్తే మంచిది.

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ’ఎమర్జెన్సీ’ ఆమె స్వీయ దర్శకత్వంలో తెరకెక్కింది. సెప్టెంబర్‌ 6న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. తన కెరీర్‌, బాలీవుడ్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్‌లో తనపై కుట్ర జరిగిందని చెప్పారు. తన సినిమాల్లో యాక్ట్‌ చేయొద్దని చాలా మందికి చెప్పారని ఆరోపించారు.