‘హరిహరవీరమల్లు’ పూర్తి కావొచ్చింది…

పవన్‌ కల్యాణ్‌ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడికల్‌ చిత్రం ‘హరిహర వీరమల్లు’ .. ధర్మం కోసం యుద్థం అనేది ఉపశీర్షిక. తొలుత ఈ చిత్రానికి క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. ఆయన మరో చిత్రంతో బిజీగా ఉండటం వల్ల ఆయన పర్యవేక్షణలో జ్యోతి కృష్ణ సినిమాను పూర్తి చేయనున్నారు. మెగా సూర్య మూవీస్‌ పతాకంపై ఎ.ఎం.రత్నం ఈ చిత్రాన్ని భారీ బ్జడెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్‌ టీజర్స్‌, పోస్టర్స్‌ విపరీతంగా సినిమాకు హైప్‌ ఇచ్చాయి. సినిమా ఆగిపోయిందని, షూటింగ్‌ జరగడం లేదని ఎన్ని ప్రచారాలు జరిగినా సినిమాకు క్రేజ్‌ మాత్రం తగ్గలేదు. నెగటివ్‌గా పబ్లిసిటీ జరిగిన ప్రతిసారీ చిత్రం బృందం అప్‌డేట్‌ ఇస్తూనే ఉంది.

ఇప్పటికే ఈ చిత్రం 50 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తయింది. పవన్‌ కల్యాణ్‌ చేయాల్సింది 20 నుంచి 25 రోజులు మాత్రమే. తాజాగా ఈ చిత్రం గురించి నిర్మాత ఎ.ఎంరత్నం లేటెస్ట్‌ అప్‌డేట్‌ ఇచ్చారు. ఓ విూడియాతో మాట్లాడిన ఆయన సినిమా విశేషాలను వెల్లడించారు. ‘పవన్‌ కల్యాణ్‌ షూటింగ్‌ చాలావరకూ పూర్తయింది. ఇంకో 20 రోజులు ఆయన షూటింగ్‌ చేస్తే సినిమా పూర్తవుతుంది. అది కూడా ఆయన వీలునుబట్టి త్వరలోనే పూర్తి చేసే ప్లాన్ చేస్తున్నారు. అమెజాన్‌ ఓటీటీ హక్కులు తీసుకుంది. వారి అగ్రిమెంట్‌ ప్రకారం సినిమా అక్టోబర్‌లో విడుదల కావాలి. వాళ్లని రిక్వెస్ట్‌ చేసి విడుదల కాస్త వెనక్కి తీసుకెళ్తాం. ఈ ఏడాదిలోనే సినిమాను విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మాగ్జిమం డిసెంబర్‌లో సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంది. షూటింగ్‌ పెండింగ్ ఉన్నా సినిమా పని జరుగుతూనే ఉంది. మచిలీపట్నం పోర్ట్‌ సీక్వెన్స్ కొన్ని సీన్స్ ఉన్నాయి. ఆ సన్నివేశాల సీజీ బావుండాలని ఇరాన్లో చేయిస్తున్నాం. కుస్తీ ఎపిసోడ్‌ బెంగళూరులో సీజీ చేస్తున్నారు. ఛార్మినార్‌ సన్నివేశాలను హైదరాబాద్‌లోనే చేయిస్తున్నారు. సినిమా చూస్తున్న ఆడియన్స్‌ ని పీరియాడికల్‌ అట్మాస్పియర్‌కు సినిమా తీసుకెళ్తుంది.

ఇందులో పవన్‌ కల్యాణ్‌ చేసే వీరోచిత పోరాటాలు ఆకట్టుకుంటాయని అన్నారు. ఇందులో పవన్‌ కల్యాణ్‌ పేదల పక్షాన పోరాడే యోధుడిగా కనిపిస్తారు. 17వ శతాబ్దం మొగల్‌ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీసుకురానున్నారు. మొదటి పార్ట్‌ను ‘స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌’ పేరుతో విడుదల చేయనున్నారు. ’ధర్మం కోసం యుద్థం’ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రంలో నిధి అగర్వాల్‌ కథానాయిక. బాబీ డియోల్, సునీల్‌, నోరా ఫతేహి తదితరులు కీలక పాత్రరధారులు. ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.