‘బ్రో’ ప్రీ రిలీజ్ ఈవెంట్​.. రావాల్సిన వారు రాలేదే?

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌-సాయిధరమ్‌ తేజ్‌ కలిసి నటించిన మల్టీస్టారర్​ మూవీ ‘బ్రో’. హాట్ బ్యూటీస్​ కేతిక శర్మ – ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ హీరోయిన్లుగా నటించారు. సినిమా మరో రెండు రోజుల్లో జులై 28న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా తాజాగా హైదరాబాద్​లో శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్​ కూడా గ్రాండ్​గా జరిగింది. అభిమానులు భారీగా తరలివచ్చి సందడి కూడా చేశారు.

అయితే ఇంత హడావుడిలోనూ అక్కడి చాలా మంది దృష్టి, అలాగే మిగతా సినీ ప్రియులు, పవన్ అభిమానుల అటెన్షన్​ అంతా ఇద్దరు దర్శకుల మీదే ఉంది. వారే హరీశ్ శంకర్​, క్రిష్. వీరిద్దరు కూడా పవన్ కల్యాణ్​తో ‘ఉస్తాద్​ భగత్ సింగ్’​, పీరియాడిక్​ డ్రామా​ ‘హరి హర వీరమల్లు’ సినిమాలు చేస్తున్నారు.

కేవలం పవన్​ డేట్స్​ కోసమే వీరిద్దరు చాలా కాలం పాటు వేచి ఉండి మరీ తమ సినిమాలను సెట్స్​పైకి తీసుకెళ్లారు. షూటింగ్​ను కూడా మొదలుపెట్టి కొంత భాగం చిత్రీకరించారు. సినిమాకు సంబంధించి అప్డేట్స్​ కూడా ఇచ్చి అభిమానుల్లో జోష్ నింపారు. అయితే ప్రస్తుతం పవన్ ఆంధ్ర రాజకీయాల్లో ఫుల్​ బిజీగా ఉంటున్నారు.

ఎన్నికలు దగ్గరపడటం వల్ల ఆయన పూర్తి దష్టంతా ప్రచార సభలు, పర్యటనలపైనే పెట్టారు. కాకపోతే ఒక్క ‘బ్రో’ సినిమానే త్వరగా పూర్తి చేసి రిలీజ్​కు రెడీ చేశారు. ‘ఉస్తాద్​ భగత్ సింగ్’​, పీరియాడిక్ డ్రామా ‘హరి హర వీరమల్లు’ షూటింగ్​లకు గ్యాప్ ఇచ్చారు. దీంతో ఆ చిత్రాలు ఇక ఎన్నికల తర్వాతే మళ్లీ షూటింగ్​ జరుపుకోనున్నాయంటూ వార్తలు వచ్చాయి. ఇంకొంతమందైతే ఉస్తాద్​ ఆగిపోయిందని కూడా అంటున్నారు.

అయితే ఇదే సమయంలో ‘బ్రో’ రిలీజ్​ ఈవెంట్​కు కూడా హరీశ్ శంకర్, క్రిష్ రాకపోవడంతో రూమర్స్​ మరింత ఎక్కువయ్యాయి. తన కోసమే దాదాపు మూడేళ్ల పాటు ఎదురుచూసి సినిమాను పట్టాలెక్కిస్తే పవన్​ రాజకీయాల బిజీతో సినిమాను పక్కనపెట్టేశారని హరీశ్ ఫీల్​ అయ్యారని, అందుకే ప్రీ రిలీజ్​కు రాలేదని అందరూ అనుకుంటున్నారు. ​అలాగే భారీ బడ్జెట్​తో సినిమా తీస్తుంటే పవన్​ డేట్స్​ సరిగ్గా ఇవ్వలేకపోయారని, అందుకే క్రిష్​ కూడా కాస్త అసహనం వ్యక్తం చేసి ప్రీ రిలీజ్​ ఈవెంట్​కు రాకపోయి ఉండొచ్చని చెబుతున్నారు. మరి ఇందులో నిజమెంతో తెలీదు కానీ వీరిద్దరూ ఈవెంట్​కు రాకపోవడం మాత్రం ప్రస్తుతం హాట్​టాపిక్​గా మారింది.