సైబర్ నేరగాళ్ల బారిన పడ్డ “భీష్మ” డైరెక్టర్ !

టెక్నాలజీ ఎంత వేగంగా పెరుగుతూ పోతోందో అంతే వేగంగా సైబర్ నేరగాళ్ల అక్రమాలూ పెరిగిపోతున్నాయి. సామాన్యులనే కాకుండా, ఈ సైబర్ నేరగాళ్లు ప్రముఖుల్ని వదలడం లేదు. తాజాగా నితిన్‌, రష్మిక మందానా జంటగా నటించిన ‘భీష్మ’ సినిమా డైరెక్టర్ వెంకీ కుడుముల కూడా సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు. సైబర్ నేరళ్ల గాళ్ల అక్రమాలను అరికట్టడం కష్టం కావడంతో ఈ నేరాలు హెచ్చు మీరుతున్నాయి.

వివరాల్లోకి వెళితే….ఇటీవల ఓ వ్యక్తి డైరెక్టర్ వెంకీ కుడుములకు కాల్ చేసి తానూ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ ప్యానెల్ సభ్యుడిని అని నమ్మించాడు. హీరో నితిన్ , హీరోయిన్ రష్మిక మందానా జంటగా నటించిన భీష్మ సినిమా చూశానని, తనకు బాగా నచ్చిందని తెలిపాడు. అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించాలనుకుంటున్నట్లు తెలిపాడు. అయితే, ఇందుకు నామినేట్ చేసుకోవడం కోసం ఒక్కో కేటగిరీకి 11 వేల రూపాయల చొప్పున చెల్లించాలని చెప్పాడు. దీనితో, ఒప్పందం చేసుకున్న వెంకీ కుడుముల మొట్ట ఆరు క్యాటగిరీలకు గాను 66 వేల రూపాయలను చెల్లించాడు.

ఆ కేటుగాడు అంతటితో ఆగకుండా మళ్ళి కాల్ చేసి, మూడు క్యాటగిరీల విషయంలో పొరపాటు జరిగిందని, మరికొంత మొత్తం చెల్లించాలని అడిగాడు. దీనితో,వెంకీ సోమవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.