మొదటిసారిగా కమర్షియల్ యాడ్ లో నటించిన బాలయ్య.. ఆ రెమ్యునరేషన్ ఏం చేశారో తెలుసా..?

టాలీవుడ్ యాక్షన్ హీరో నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నందమూరి తారక రామారావు వారసుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ తన నటనతో , డైలాగ్ డెలివరీ తో ప్రేక్షకులను ఆకట్టుకొని స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. ఇలా ఎన్నో దశాబ్దాలుగా 100కు పైగా సినిమాలలో నటించిన బాలకృష్ణ ఇటీవల అఖండ సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అఖండ సినిమా ఇచ్చిన విజయంతో బాలకృష్ణ ఉత్సాహం మరింత రెట్టింపు అయ్యింది.

ఈ క్రమంలో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటమే కాకుండా రియాలిటీ షో లో కూడా హోస్ట్ గా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న “వీరసింహారెడ్డి” అనే సినిమాలో నటిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక మరొకవైపు బాలకృష్ణ అన్ స్టాపబుల్ సీజన్ 2 కి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. అంతే కాకుండా తన 48 ఏళ్ల నట జీవితంలో మొదటిసారిగా బాలయ్య ఒక కమర్షియల్ యాడ్ లో నటించారు.

ఇప్పటివరకు కమర్షియల్ యాడ్స్ కి దూరంగా ఉంటున్న బాలకృష్ణ… అన్ స్టాపబుల్ సీజన్ 2 కి స్పెషల్ పార్ట్నర్ గా వ్యవహరిస్తున్న సాయిప్రియ కన్ స్ట్రక్షన్స్ కోసం బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. రీసెంట్ గా యాడ్ షూట్ లో కూడా పాల్గొన్నారు. ఇక ఈ యాడ్ లో నటించినందుకు బాలకృష్ణ రూ. 16 కోట్ల రూపాయలు పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. ఈ మొత్తం డబ్బుని తాను చైర్మన్గా వ్యవహరిస్తున్న బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి విరాళంగా ఇచ్చాడు. బాలకృష్ణ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సదరు కన్స్ట్రక్షన్ సంస్థ మరొక కోటి రూపాయలు అదనంగా ఆసుపత్రికి విరాళం ఇచ్చినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న బాలయ్య అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.