కేబీసీ షోలో భార్య‌పై జోకు వేసిన భ‌ర్త‌.. మండిప‌డ్డ మెగాస్టార్

బాలీవుడ్ పెహ‌న్ షా అమితాబ్ బ‌చ్చ‌న్ అక్టోబర్ 11, 2020న‌ 78వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఐదు దశాబ్దాలుగా భారత సినీ ఇండస్ట్రీని ఎలుతూ.. కోట్లాది మంది హృదయాల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈ బాలీవుడ్ రారాజు ఇప్ప‌టికీ సినిమాలు,షోస్‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూనే ఉన్నారు. భారతీయ సినీ దిగ్గ‌జం,బాలీవుడ్ సూపర్ స్టార్.. మెగాస్టార్‌గా పేరు ప్రఖ్యాతలను పొందిన‌ నట దిగ్గజం అమితాబ్ బచ్చన్ పురాతన కాలం నటుడైనప్పటికీ.. 78 ఏళ్ల వయసులోను తన చలాకీతనం.. నటనానైపుణ్యాలతో.. ఇప్పటికీ ఎంతోమంది అగ్రనటులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

అమితాబ్ బచ్చన్ చివరిసారిగా ‘గులాబో సీతాబో’లో కనిపించగా, ప్రస్తుతం ఝండ్, బ్రహ్మాస్త్రా, చెహ్రేతోపాటు.. ప్రభాస్ సినిమాలో నటిస్తున్నారు. మ‌రోవైపు ‘కౌన్ బనేగా కరోడ్‌పతి 12 సిజన్‌తో కూడా తన అభిమానులను అలరిస్తున్నారు. అయితే కేబీసీ షోలో ఓ కంటెస్టెంట్ త‌న భార్య‌పై జోకు వేయ‌గా, దానిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు అమితాబ్ బ‌చ్చ‌న్. కౌన్‌ బనేగా కరోడ్‌ పతి షోలో భాగంగా కంటెస్టెంట్‌ను సాధారణంగా పలు ప్రశ్నలు అడిగారు. ఇందులో గెలిచిన డబ్బు ఏం చేస్తారని ప్రశ్నించారు. దీనికి కంటెస్టెంట్ కాస్త అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తూ.. 15 ఏళ్లుగా నా భార్య ముఖాన్ని చూసి విసుగొచ్చిందని చెప్పాడు.

కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో నేను గెలుచుకునే డబ్బుతో నా భార్య‌కు ప్లాస్టిక్ సర్జరీ చేయిస్తానని కుళ్ళు జోక్ వేశాడు. ఈ మాట‌ల‌కి కాస్త హ‌ర్ట్ అయిన అమితాబ్ బ‌చ్చ‌న్.. స‌ర‌దాకి కూడా అలాంటి మాట‌లు అనొద్దు అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈయ‌న మాట్లాడిన మాట‌లని సీరియస్‌గా తీసుకోవద్దని ఆ కంటెస్టెంట్ భార్యకు అమితాబ్ బచ్చన్ చెప్పారు. దీంతో అమితాబ్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు నెటిజ‌న్స్. కాగా, అమితాబ్ ఆసుప‌త్రిలో అడ్మిట్ అయిన‌ట్టు పుకార్లు షికారు చేయ‌గా, దానిని అభిషేక్ ఖండించిన సంగ‌తి తెలిసిందే. ఆసుప‌త్రిలో ఉంది నాన్న డూప్ అయి ఉంటార‌ని చ‌మ‌త్క‌రించాడు.