ఎట్ట‌కేల‌కు రాజ‌మౌళి సినిమా కోసం ముంబై నుండి వ‌చ్చిన బాలీవుడ్ హీరోయిన్..ఇక చ‌ర‌ణ్‌తో సంద‌డి షురూ!

బాహుబ‌లి సినిమా త‌ర్వాత ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ప్ర‌తిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్. భారీ బ‌డ్జెట్‌తో డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. అల్లూరి సీతారామ‌రాజు పాత్ర పోషిస్తున్న రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న అలియా భ‌ట్ క‌థానాయిక‌గా న‌టిస్తుంటే, కొమురం భీం పాత్ర పోషిస్తున్న ఎన్టీఆర్ స‌ర‌స‌న ఒలివియో మోరిస్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. లాక్ డౌన్ త‌ర్వాత మొద‌లైన ఈ చిత్ర షూటింగ్ దాదాపు నెల రోజుల పాటు హైద‌రాబాద్‌లోనే జ‌రిగింది. రాత్రి స‌మ‌యాల్లో యాక్ష‌న్ స‌న్నివేశాలు చిత్రీక‌రించారు.

మ‌రికొద్ది రోజుల‌లో మ‌హాబ‌లేశ్వ‌రంలో ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ త‌ర్వాతి షెడ్యూల్ జ‌ర‌గ‌నుంది. ఈ షెడ్యూల్ కోసం బాలీవుడ్ భామ అలియా భ‌ట్‌ ముంబై నుండి వ‌చ్చేసింది. చిత్ర బృందంతో క‌లుస్తున్న విష‌యాన్ని ఈ అమ్మ‌డు త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసింది. ఎప్ప‌టి నుండో అలియా భ‌ట్ వ‌స్తుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతుండ‌గా, ఇన్నాళ్ల‌కి ఈ ముద్దుగుమ్మ టీంతో క‌లిసింది. ఇక చ‌ర‌ణ్‌, అలియాపై జ‌క్క‌న్న కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. సీత పాత్ర‌లో అలియా ఈ చిత్రంలో క‌నిపించ‌నున్న సంగ‌తి తెలిసిందే.

ఆర్‌ఆర్‌ఆర్‌’ (రౌద్రం రణం రుధిరం) చిత్రాన్ని దాదాపు 400కోట్ల వ్యయంతో నిర్మాత డి.వి.వి.దానయ్య తెరకెక్కిస్తున్నారు. మ‌హారాష్ట్రంలోని మహాబలేశ్వరంలో ఉన్న‌ పర్వతపంక్తులు, ప్రకృతి అందాల నడుమ స‌న్నివేశాలు చిత్రీక‌రించ‌నున్నారు.2021లో తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అజయ్‌ దేవగణ్‌, సముద్రఖని, శ్రియా శరన్‌ సహా హాలీవుడ్‌ యాక్టర్స్‌ రే స్టీవెన్‌ సన్‌, అలిసన్‌ డూడి చిత్రంలో ముఖ్య పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు