మహిళా సమ్మాన్ సేవింగ్స్ పథకానికి సుకన్య సమృద్ధి పథకానికి మధ్య ఉన్న ఈ తేడాలని గమనించారా..?

సమాజంలో మహిళలకు ఆర్థికంగా భద్రత కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టింది. ఇటీవల 2023లో బడ్జెట్‌లో మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎంఎస్ఎస్‌సీ) అనే మరొక పథకం ప్రవేశపెట్టింది. అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన పథకం ద్వారా బాలికలు ప్రయోజనాలు పొందుతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన, మహిళా సమాన్ సేవింగ్స్ పథకానికి తేడా ఏంటి? వడ్డీ రేట్లు, వచ్చే రాబడికి ఏమైనా వ్యత్యాసం ఉందా? అనే విషయాల గురించి తెలుసుకుందాం.

అర్హత : 10 సంవత్సరాల వయస్సు దాటని ఆడపిల్ల పేరు మీద సుకన్య సమృద్ధి యోజన పథకంలో ఖాతాను తెరవవచ్చు. అయితే ఎంఎస్ఎస్‌సీ పథకంలో పెట్టుబడి పెట్టడానికి వయస్సు పై ఎలాంటి నిషేధం లేదు.

వడ్డీ రేటు : ఎస్ఎస్‌వైకు పథకంలో ప్రతి త్రైమాసికంలో 7.6 శాతం వడ్డీ రేటు అందిస్తున్నారు. అయితే ఎంఎస్ఎస్‌సీ పథకంలో సంవత్సరానికి 7.5 శాతం వడ్డీ రేటును అందిస్తున్నారు.

పదవీకాలం: సుకన్య సమృద్ధి యోజన పథకంలో 15 సంవత్సరాల వ్యవధిలో క్రమం తప్పకుండా చిన్న మొత్తాలలో పెట్టుబడిని పెట్టవచ్చు. ఇది దీర్ఘకాలిక పథకం. అయితే మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ అనేది రెండు సంవత్సరాల కాలవ్యవధితో కూడిన స్వల్పకాలిక పథకం. అలాగే, ఈ పథకం ఏప్రిల్ 1, 2023 నుండి అందుబాటులో ఉంటుంది.

పెట్టుబడి పరిమితులు : ఎంఎస్ఎస్‌సీ పథకంలో గరిష్టంగా రూ. 2 లక్షల డిపాజిట్‌ చేయవచ్చు. అయితే ఎస్ఎస్‌వై లో ఒక ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా రూ. 250 నుంచి గరిష్టంగా రూ. 1,50,000 పెట్టుబడిని పెట్టవచ్చు.

అకాల ఉపసంహరణ : మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ అకాల ఉపసంహరణను అనుమతిస్తుంది. అయితే, ఎస్ఎస్‌వై విషయంలో ఖాతాదారులకు 18 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత, గత ఆర్థిక సంవత్సరం చివరిలో ఉన్న బ్యాలెన్స్‌లో గరిష్టంగా 50 శాతం వరకు పాక్షిక ఉపసంహరించుకునే అవకాశం ఉంది.

పన్ను ప్రయోజనాలు ఇలా :

ఎంఎస్ఎస్‌సీ పథకానికి పన్ను ప్రయోజనాన్ని ఇంకా ప్రకటించలేదు. సుకన్య సమృద్ధి యోజన ఖాతాలో పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సి కింద సంవత్సరానికి రూ. 1.5 లక్షల వరకు పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం నుంచి తీసివేయవచ్చు. సంపాదించిన వడ్డీ మరియు మెచ్యూరిటీపై మొత్తం కూడా పన్ను రహితంగా ఉంటుంది..