ముఖంపై నల్ల మచ్చలతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అవి పోగొట్టుకోవడానికి వంటింటి చిట్కాలు కొన్ని ఉన్నాయి. అవేమిటంటే..
రెండు టేబుల్స్పూన్ల నీళ్లల్లో రెండు టేబుల్స్పూన్ల బేకింగ్సోడా వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ముఖంపై నల్లని మచ్చలు ఉన్న చోట రాసుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్లతో కడుక్కుని ఆ ప్రదేశంలో మాయిశ్చరైజర్ని రాసుకోవాలి. ఇలా వారానికి రెండు లేదా మూడుసార్లు చేస్తే ముఖం మచ్చల్లేకుండా అందంతో మెరుస్తుంది.
ఒక టేబుల్ స్పూన్ బ్రౌన్షుగర్, ఒక టేబుల్స్పూన్ తేనె, రెండు టేబుల్స్పూన్ల నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని ముఖంపై వృత్తాకారంలో సున్నితంగా రాయాలి. ఇది శక్తివంతమైన ఫేస్పీల్. ఇలా రాసుకుని కొంతసేపైన తర్వాత ముఖాన్ని గోరువెచ్చటి నీళ్లతో కడుక్కోవాలి. ఆ తర్వాత నౌరిషింగ్ మాస్కును చర్మంపై రాసుకోవాలి. ఇలా చేసే ముఖ చర్మం ఎంతో మృదువుగా తయారవుతుంది.
టీ ట్రీ ఆయిల్ కూడా ముఖంపై ఏర్పడ్డ నల్ల మచ్చలను పోగొడుతుంది. చర్మంలోని బాక్టీరియాను నిర్మూలిస్తుంది. చర్మంలోని బాక్టీరియా ఎప్పుడైతే నశిస్తుందో అప్పుడు నల్ల మచ్చలు కూడా పోతాయి. అందుకే టీ ట్రీ ఆయిల్ని చల్లిన దూదితో నల్లమచ్చలున్న చోట సున్నితంగా అద్దాలి. గ్రీన్టీ ప్యాకట్లోని పొడిని ఒక టీ స్పూన్ నీటిలో కలిపి ఆ మిశ్రమాన్ని ముఖంపై మూడు నిమిషాలపాటు మర్దన చేసుకోవాలి. తర్వాత గోరువెచ్చటి నీళ్లతో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంలోని జిడ్డు తగ్గుతుంది. ముఖంపై ఉన్న నల్లమచ్చలు పోతాయి.