అలసట ,నీరసం వంటి సమస్యలు మీలో కనిపిస్తున్నాయా…వీటిని తప్పకుండా పాటించండి?

శారీరక శ్రమ పని ఒత్తిడి కారణంగా అలసట రావడం సర్వసాధారణం. అయితే కొందరిలో చిన్న పని చేసిన లేదా కొద్ది దూరం నడవగానే తీవ్రమైన అలసట, నీరసంతో బాధపడుతుంటారు. మన శరీర నిత్య జీవక్రియలకు అవసరమైన పోషకాలు సమృద్ధిగా అందకపోతే పోషకాహార లోపం వల్ల మనలో నీరసం, అలసట వంటి సమస్యలు ఏర్పడతాయి. దీనివలన మనలో చురుకుదనం తగ్గి ఏ పని చేయాలన్నా ఆసక్తి చూపరు. తరచూ నీరసం అలసట వంటి సమస్యలతో బాధపడేవారు ఉదయాన్నే తమ ఆహారంలో సంపూర్ణ పోషకాహారాన్ని తీసుకున్నట్లయితే మన శరీరంలోని అవయవాల పనితీరు మెరుగుపడి ఆ రోజంతా మనల్ని ఎంతో చురుగ్గా ఉండునట్లు చేస్తుంది.

ఉదయాన్నే నవధాన్యాలను మొలక కట్టి ప్రతిరోజు అల్పాహారానికి ముందే ఆహారంగా తీసుకుంటే వీటిలో పుష్కలంగా విటమిన్స్ ,మినరల్స్ ,కార్బోహైడ్రేట్స్ యాంటీ ఆక్సిడెంట్ మనల్ని రోజంతా ఉల్లాసంగా ఉండునట్లు చేస్తుంది. అలాగే వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

ఉదయాన్నే కాఫీ, టీ లాంటి పానీయాలకు బదులుగా రాగి జావాను సేవిస్తే వీటిలో అధికంగా ఉండే ఫైబర్, క్యాల్షియం, ఐరన్ వంటి ఖనిజలవణాలు మన శరీరాన్ని ఎల్లప్పుడు దృఢంగా ఉండునట్లు చేస్తాయి. రాగుల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది ఇది రక్తంలోని హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి మనలో అలసటను, నీరసాన్ని తొలగిస్తుంది.

ప్రతిరోజు కొన్ని నానబెట్టిన ఖర్జూర పండ్లను అల్పాహారానికి ముందే తీసుకుంటే మన శరీరానికి కావలసిన క్యాలరీలు పుష్కలంగా లభిస్తాయి. ఖర్జూర పండ్లలో కొవ్వు పదార్థాలు తక్కువ క్యాలరీలు ఎక్కువ కావున మన రోజువారి జీవక్రియలకు అవసరమైన క్యాలరీలు పుష్కలంగా లభిస్తాయి. ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనత వంటి సమస్యలు తొలగుతాయి.

మనకు నీరసంగా ఉన్న సమయంలో ఒక అరటి పండును తింటే ఇందులో పుష్కలంగా ఉన్న కార్బోహైడ్రేట్స్ మనకు తక్షణ శక్తిని ఇస్తుంది. అలాగే అరటి పండులో పొటాషియం, మెగ్నీషియం ,ఫైబర్ పుష్కలంగా ఉండడంవల్ల రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది.

దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి కూడా తరచూ
నీరసం, అలసట వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. అలాంటివారు వైద్య నిపుణులు సంప్రదించి తగిన జాగ్రత్తలు పాటించడం మంచిది.