కొడుకుని నిలబెట్టడం కోసం నాగ్ సెంటిమెంట్ ప్లే

అప్పట్లో నాగేశ్వరరావు, నాగార్జున కలిసి ఒకే సినిమాలో చేస్తే క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత చాలా కాలానికి నాగార్జున, నాగచైతన్య, అఖిల్ కలిసి ఓ సినిమా చేస్తే పెద్ద హిట్టైంది. ఇప్పుడు అదే పార్ములాని మరోసారి అప్లై చేయబోతున్నారు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. రీసెంట్ గా నేల టిక్కెట్ సినిమాతో డిజాస్టర్ ఇచ్చిన ఆయన తన తొలి చిత్రం సోగ్గాడే చిన్ని నాయనాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమాలో నాగచైతన్య కూడా కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు నాగార్జున,నాగచైతన్యలను ఒప్పిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఆల్రెడీ నాగార్జునతో సోగ్గాడే చిన్న నాయినా, నాగచైతన్య…రారండోయ్ వేడుక చూద్దాం చిత్రాలు డైరక్ట్ చేయటంతో ఇద్దరితోనూ డైరక్ట్ రాపో ఉంది. దాంతో ఇద్దరినీ ఒప్పించటం పెద్ద కష్టం కాలేదట.

సీక్వెల్ విషయానికి వస్తే..

2016 సంక్రాంతి కానుక‌గా విడుద‌లై ప్రేక్షకుల ఆద‌ర‌ణ పొందిన చిత్రం సోగ్గాడే చిన్ని నాయ‌నా. నాగ్ డబుల్ షేడ్స్‌లో నటించి మెప్పించిన ఈ చిత్రం ఆయ‌న‌ కెరియర్‌లోనే అత్యధిక కలెక్షన్లు సాధించింది. బంగార్రాజు అనే పాత్ర‌లో నాగ్ త‌న న‌ట‌నతో ఆక‌ట్టుకున్నాడు. రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి లు హీరోయిన్‌లుగా నటించగా, ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీక్వెల్‌కు బంగార్రాజు అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నామ‌ని అన్నారు.

సీక్వెల్‌కి సంబంధించి క‌ళ్యాణ్ కృష్ణ కొద్ది రోజులుగా స్క్రిప్ట్ వ‌ర్క్ చేస్తుండ‌గా, ఇటీవ‌ల క‌థ‌ని నాగ్‌కి వినిపించార‌ట‌. అయితే ఆ క‌థ‌లో కొన్ని మార్పులు చేసి స్టోరీని ఓ కొలిక్కి తెచ్చార‌ని అంటున్నారు. క‌థ మొత్తం బంగార్రాజు చుట్టూనే తిర‌గ‌నుండ‌గా, ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంద‌ట‌.

ఇక నాగ్ స‌ర‌స‌న ర‌మ్య‌కృష్ణ‌ని ఎంపిక చేశార‌ని అంటున్నారు. చైతూ కూడా చిత్రంలో న‌టించ‌నున్నాడ‌ని స‌మాచారం. ఆయ‌న‌కి జోడీగా ఎవరిని ఎంపిక చేయాలా అని చిత్ర‌బృందం క‌స‌ర‌త్తులు చేస్తుంద‌ట‌. త్వ‌ర‌లో ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంది. నాగ్ చివ‌రిగా దేవ‌దాస్ అనే మ‌ల్టీ స్టార‌ర్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.