ఈ వార్తలు నిజమైతే అఖిల్ తప్పు చేస్తున్నట్లే?!

గత పది రోజులుగా మీడియాలో ఎక్కడ చూసినా దర్శకుడు క్రిష్ పేరే వినపడుతోంది. అందుకు కారణం కంగనాతో వివాదమే. అయితే ఈ నేపధ్యంలో మరో వార్త తెలుగు మీడియాలో హైలెట్ అయ్యింది. అది ఆయన తన తదుపరి చిత్రాన్ని అఖిల్ అక్కినేని తో చేయబోతున్నారని. అయితే ఎంతవరకూ నిజముంది అనేది తెలియదు కానీ ఎక్కడ చూసినా ఈ కాంబో గురించిన వార్తలే కనపడుతున్నాయి.

వరసపెట్టి అఖిల్ మూడు సినిమాలు బోల్తా కొట్టడంతో నెక్ట్స్ చిత్రం ఏ దర్శకుడుతో చేయాలనే మీమాంస మొదలైంది. మిస్టర్ మజ్ను పై ఎన్నో ఆశలు పెట్టుకున్నా…అవేమీ ఫలించలేదు. నటన పరంగా అఖిల్ మంచి మార్కులే పడినా ఫలితం లేదు. దాంతో ఇప్పుడు అఖిల్ తన నెక్ట్స్ సినిమాపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.

అందుతున్న సమాచారం మేరకు అఖిల్ నెక్స్ట్ సినిమా కోసం శ్రీను వైట్ల, పూరి జగన్నాథ్ పేర్లు పరిశీలిస్తున్నారు. మరో ప్రక్క క్రిష్ చెప్పిన కథ అఖిల్ కు అటు నాగార్జునకు నచ్చడంతో సినిమాకు గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చారని అంటున్నారు. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లోనే నాగార్జున నిర్మిస్తారట. అఖిల్ కొంతకాలం విశ్రాంతి తీసుకున్న తరువాతే ఈ సినిమా చేస్తాడని తెలుస్తోంది. అయితే అఖిల్, క్రిష్ కాంబినేషన్ సినిమా అనేసరికి కొందరు నెగిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. అసలే అఖిల్ పరిస్దితి బాగోలేదని, అలాంటి క్లిష్టమైన పరిస్దితుల్లో కొంచెం ఫామ్ లో ఉన్న దర్శకుడుతో ముందుకు వెళ్లచ్చుగా అని సోషల్ మీడియాలో సలహాలు ఇస్తున్నారు.

ఓ ప్రక్క క్రిష్‌ మణికర్ణిక వివాదం, మహానాయకుడు మూవీతో సతమతమవుతున్నారు. మహానాయకుడు పూర్తియ్యాక ఆయన కొద్ది నెలలు పాటు రెస్ట్ తీసుకుని తదుపరి ప్రాజెక్టులోకి వెళ్తారు. అయితే ఆయన అఖిల్ తో చేస్తారా..మరో హీరోతో చేస్తారో చూడాలి. ఏదైమైనా అఖిల్‌ తన తదుపరి చిత్రాన్ని అధికారికంగా ప్రకటించేవరకు వేచి చూడాల్సిందే.